కేసీఆర్‌కు లేఖ రాసిన అధికారులు.. ‘చారి’కి ఎల్ఓపీ లేనట్టే?

పెద్దల సభలో ప్రతిపక్షనేత ఎంపిక పై పీటముడి పడినట్టు తెలుస్తున్నది.

Update: 2024-08-03 02:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్దల సభలో ప్రతిపక్షనేత ఎంపికపై పీటముడి పడినట్టు తెలుస్తున్నది. దీనితో మళ్లీ కొత్త నేతను ఎంపిక చేసే పనిలో మాజీ సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ సారి మహిళ పేరును పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. విధానమండలిలో ప్రధాన ప్రతిపక్షనేతగా ఎమ్మెల్సీ మధుసూదనాచారిని ఎంపిక చేసి, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని మండలి చైర్మన్‌కు లేఖ రాశారు.

అయితే గవర్నర్ కోటాలో నామినేటెడ్ అయిన ఎమ్మెల్సీని రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా పరిగణిస్తారు. కానీ చారిని లీడర్ ఆఫ్ అపోజిషన్‌గా గుర్తించడం వల్ల న్యాయపరమైన చిక్కు లు వస్తాయని నిపుణులు సూచించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు బీఆర్ఎస్ అధ్యక్షుడికి లేఖ రాయగా, మరో ఎమ్మెల్సీని ఎంపిక చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది.

పరిశీలనలో సత్యవతి రాథోడ్ పేరు

మండలిలో ప్రధాన ప్రతిపక్ష లీడర్‌గా సత్యవతి రాథోడ్ పేరును కేసీఆర్ పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సత్యవతి గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మహిళా ఎమ్మెల్సీని ఎల్ఓపీ పదవి ఇవ్వడం వల్ల ఎలాంటి విమర్శలు రావని బీఆర్ఎస్ నేత భావిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆమె పదవి కాలం మరో ఏడాది మాత్రమే ఉంది. ఆమె రిటైర్డ్ అయిన తరువాత అప్పటి రాజకీయ పరిస్థితుల మేరకు లీడర్ ఆఫ్ అపోజిషన్‌ను ఎంపిక చేద్దామని అభిప్రాయపడినట్టు తెలిసింది.


Similar News