హైదరాబాద్లో మొదలైన మూసీ ప్రక్షాళన
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలును వేగవంతం చేసింది.
దిశ, వెబ్డెస్క్: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు(Musi Riverfront Project) అభివృద్ధిపై దృష్టి పెట్టిన ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక అమలును వేగవంతం చేసింది. గురువారం తెల్లవారుజాము నుంచే నగరంలో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ముందుగా గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్నగర్లో కొలతలు తీసుకున్నారు. అంతేకాదు.. పాతబస్తీలోని ఛాదర్ఘాట్, మూసానగర్, శంకర్నగర్లో సర్వే నిర్వహించారు. కూల్చబోయే నిర్మాణాలపై మార్క్ చేస్తున్నారు. కాగా, మొత్తం మూసీ పరివాహక ప్రాంతంలో 55 కి.మీ పరిధిలో మొత్తం 12 వేల ఆక్రమణలను అధికారులు గుర్తించి వాటిని తొలగించే బాధ్యతను సర్కార్ ‘హైడ్రా’కు అప్పగించింది.
అయితే.. మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసాలను కోల్పోయి నిర్వాసితులుగా, బాధితులుగా మారుతున్న కుటుంబాలన్నింటికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇప్పటికే భరోసా ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఇటీవల అధికారులతో కలిసి పలు చోట్ల పర్యటించి కొన్ని కుటుంబాలతో మాట్లాడారు. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ను రెడీ చేసిన ప్రభుత్వం నిర్వాసితుల విషయంలో అన్యాయం జరగకుండా తగిన పునరావాసం, నష్టపరిహారం, డబుల్ ఇండ్ల కేటాయింపు తదితరాలపై కలెక్టర్ల సమక్షంలోనే ప్రతీ కుటుంబానికి వివరాలను అందించేలా షెడ్యూలు రూపొందిందింది.