కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ పుణ్య స్నానానికి కుంభమేళా వెళ్లి తిరుగు ప్రయాణంలో మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ హెచ్.సాయిరెడ్డి తెలిపారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఫిబ్రవరి14: కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ పుణ్య స్నానానికి కుంభమేళా వెళ్లి తిరుగు ప్రయాణంలో మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ హెచ్.సాయిరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కర్నాటక లోని బీదర్ జిల్లా బసవ కళ్యాణ మండలం మిర్జాపూర్ గ్రామానికి చెందిన అనిత (59) అనే మహిళ జైపూర్ హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా..గురువారం రాత్రి మృతి చెందింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ హరికృష్ణ ఇచ్చిన సమాచారంతో..మృతురాలి వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం మహిళ అనారోగ్యంతో మరణించిందని గుర్తించారు. మృతురాలి వద్ద ఉన్న సెల్ ఫోన్ , ఆధార్ , పాన్ కార్డుల ఆధారంగా ఆమె వివరాలు తెలుసుకున్నట్లు ఎస్ ఐ సాయిరెడ్డి తెలిపారు. మృతురాలి కొడుకుకు ఫోన్ చేసి విచారించగా, మృతురాలు కుంభమేళాలో పుణ్యస్నానం కోసం ప్రయాగరాజ్ వెళ్లి తిరిగి వస్తున్నట్లు తెలిపారు. మార్గ మధ్యలో అనారోగ్యంతో మృతిచెందినట్లు తెలుస్తోందన్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు ఆయన తెలిపారు.