విరివిగా పంట రుణాలు పంపిణీ చేయాలి
ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు.

దిశ ప్రతినిధి, నిజామబాద్ మార్చి 18 : ఆయా రంగాలకు రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, వచ్చే రానున్న సీజన్ లో రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు తదితర అంశాలపై ఆయా బ్యాంకుల వారీగా అదనపు కలెక్టర్ సమీక్షించారు. పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని, రుణ పంపిణీ లక్ష్యాన్ని అధిగమించాలని అన్నారు.
ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోతున్నాయని అన్నారు. క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ, వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్ధవంతంగా అందించాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను అర్హత కలిగిన రైస్ మిల్లర్లకు వెంటదివెంట బ్యాంకు గ్యారంటీలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. వ్యవసాయ శాఖతో పాటు ఇతర పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర శాఖలతో సమన్వయము చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని హితవు పలికారు.
రుణాలు తీసుకున్న వారు యూనిట్లు స్థాపించారా లేదా అన్నది నిశితంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో అందిస్తున్న శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఎల్.డీ.ఓ పృథ్వీ, డీఆర్డీఓ సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్ కుమార్, మెప్మా పీ.డీ రాజేందర్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సురేష్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు