అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
నిరుపేదల కడుపు నింపడానికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారు.
దిశ, కామారెడ్డి : నిరుపేదల కడుపు నింపడానికి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు పక్కదారి పట్టిస్తున్నారు. దాంతో ప్రభుత్వ ఆశయానికి గండిపడడంతో పాటు నిరుపేదల కడుపు మాడుస్తున్నారు. నూతన పద్ధతుల ద్వారా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. 25 కిలోల బ్యాగులలో నింపి ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు.
బుధవారం రాత్రి ఇదే పద్ధతిలో ఆటోలో రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. సుమారు 10 క్వింటాళ్ల వరకు బియ్యం పట్టుబడినట్లు తెలుస్తోంది. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే అడ్డుకోవాల్సిన సివిల్ సప్లై, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ తదితర శాఖల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.