గ్రూప్స్ 1 ప్రిలిమినరీ పరీక్షకు 77.49 శాతం మంది హాజరు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా ప్రశాంతంగా జరిగింది.

Update: 2024-06-09 09:26 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా ప్రశాంతంగా జరిగింది. ప్రిలిమినరీ పరీక్షకు 77.49 శాతం మంది హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మాణిక్ బండార్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు, ఎస్.ఆర్ కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయో-మెట్రిక్ హాజరు సేకరణ కోసం ప్రత్యేకంగా నియమించిన ఇన్విజిలేటర్లను పిలిపించి, బయో-మెట్రిక్ సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రాథమిక చికిత్స వసతులతో కూడిన ఏఎన్ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. అభ్యర్థుల హాల్ టికెట్లను ఆధార్ వంటి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న

     మీదటే, మెయిన్ ఎంట్రెన్స్ వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లలతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఆయా పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తు.చ తప్పకుండా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్ష జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. కాగా, జిల్లాలో 77.49 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 12833 మంది అభ్యర్థులకు గాను 9945 మంది పరీక్ష రాయగా, 2888 మంది గైర్హాజరయ్యారని వివరించారు.

    అంతకుముందు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని స్ట్రాంగ్ రూమ్ నుండి కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఆయా రూట్ల వారీగా ప్రశ్న పత్రాలు, ఇతర సామగ్రిని పరీక్షా కేంద్రాలకు తరలించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగగా, పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓ.ఎం.ఆర్ షీట్లు, ఇతర మెటీరియల్ ను నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి, పోలీస్ ఎస్కార్ట్ నడుమ తిరిగి స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించారు. పలు పరీక్షా కేంద్రాలను సైతం తనిఖీ చేశారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, సజావుగా ప్రిలిమ్స్ పరీక్షలు ముగిశాయి.

గ్రూప్-1 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో నిజామాబాద్​ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ వివిధ కళాశాలల యందు ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. 41 పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా ఈ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.

మహిళల చెవుల కమ్మలు, దుద్దులు తీయించిన పరీక్ష సిబ్బంది..

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళల చెవులకు ఉన్న బంగారు ఆభరణాలు అయిన కమ్మలు, దుద్దులు తీసివేయాలని నగరంలోని సీఎస్ ఐ పరీక్ష కేంద్రం వద్ద చెప్పడంతో పరీక్ష రాయడానికి వచ్చిన వారు కొంత ఇబ్బంది పడ్డారు. ఎంత చెప్పినా వినకపోవడంతో చెవులకున్న కమ్మలు దద్దులు తీసి వెంట వచ్చిన వారికి ఇచ్చి పరీక్ష హాల్లోకి వెళ్లారు. కానీ బురఖా లో వచ్చిన వారిని మాత్రం ఎలాంటి తనిఖీలు చేయడం లేదని కనీసం బురఖా కూడా తీయమని చెప్పడం లేదని, అందరికీ సమన్యాయం పాటించాలని పరీక్ష రాసే వారు కోరుతున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అయిన సెల్ ఫోన్, స్మార్ట్ వాచ్ లాంటివి పరీక్ష హాల్లోకి అనుమతించకపోతే సరేగాని మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా చెవులకున్న కమ్మలు తీసేయమనడం ఏంటని వెంట వచ్చిన వారు కొందరు ప్రశ్నించారు. 


Similar News