New MSME policy: కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ.. ఎస్సీ, ఎస్టీలతో పాటు వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్

కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

Update: 2024-09-18 07:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపన, అభివృద్ధి దిశగా చర్యలకు పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకువచ్చింది. ఎంఎస్ఎంఈ(చిన్న, మధ్యతరహా పరిశ్రమల) పాలసీ-2024ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ మాదాపూర్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులు, పరిశ్రమల శాఖకు సంబంధించిన 22 అసోసియేషన్స్ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.

ఆరు సమస్యల గుర్తింపు...

చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న ఆరు అడ్డంకులను ఈ కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వం గుర్తించింది. 1) భూమి సౌలభ్యత, 2) మూలధన లభ్యత, 3) ముడిపదార్థాల అందుబాటు, 4) శ్రామిక శక్తి కొరత, 5) సాంకేతిక సౌలభ్యత లేకపోవడం, 5) మార్కెట్‌లతో అనుసంధానం లేకపోవడం వంటి అంశాలు తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ అడ్డంకులను తొలగించడానికి 40 ప్రతిపాదనలు చేసింది. సరసమైన ధరలకు భూమిని అందించడం, ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచడం, ముడి పదార్థాల లభ్యతను అందుబాటులో ఉంచడం, నైపుణ్యం గల కార్మికుల లభ్యత మెరుగుపరచడం, నూతన సాంకేతికతను ప్రోత్సహించడం, మార్కెట్‌లతో అనుసంధానత మెరుగుపరచడం వంటి అంశాలతో ఎంఎస్ఎంఈలకు దన్నుగా నిలవబోతున్నట్లు పాలసీలో పేర్కొన్నది.

20 శాతం ప్లాట్లు ఎంఎస్ఎంఈలకే.

ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్న ప్రతి పారిశ్రామిక పార్కులో 20 శాతం ప్లాట్లు ఎంఎస్ఎంఈల కోసం రిజర్వు చేయనున్నట్లు కొత్త పాలసీలో ప్రభుత్వం పేర్కొన్నది. వచ్చే ఐదేళ్లలో ప్రతి జిల్లాలో ఒక పారిశ్రామికి పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, అలాగే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య 10 పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మించబోతున్నదని స్పష్టం చేసింది. ఈ 10 పారిశ్రామిక పార్కులలో 5 ఎంఎస్ఎంఈ పార్కులు ఉండనున్నాయి. వీటిలోని ప్రతి ఎంఎస్ఎంఈ పార్కులో 5 శాతం ప్లాట్లు మహిళా పారిశ్రామిక వేత్తలకు, 15 శాతం ప్లాట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రిజర్వ్ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఎంఎస్ఎంఈలను సమర్థవంతంగా అమలుపరిచి నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నది.

టీఎస్ ఐ‌పాస్‌తో పెద్ద కంపెనీలకే ప్రయోజనం : జయేశ్ రంజన్

గతంలో ఉన్న టీఎస్ ఐపాస్ పాలసీ వల్ల పెద్ద కంపెనీలకే ప్రయోజనం ఉందని, అందువల్ల కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల కోసం పాలసీ ఉండాలని సూచించారని ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు. దేశంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి రాష్ట్ర పరిస్థితి మెరుగు పడేలా ఈ పాలసీ రూపొందించామన్నారు. కంపెనీలు, సంస్థలతో పోలిస్తే ఎంఎస్ఎంఈలు అనేక సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటున్నాయని వీటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందిచాలనేది ఈ పాలసీలో పొందుపరిచామన్నారు.


Similar News