TG Govt: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త గైడ్లైన్స్
రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. అంతేకాకుండా.. పథకం అమలులో ఎలాంటి అవకతవకలు లేకుండా జాగ్రత్తలు పడుతున్నది. ఎక్కడా కూడా అనర్హులకు పథకంలో చోటు కల్పించకుండా ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నది. ఇప్పటికే ఈ పథకాన్ని జనవరి 26ను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. అదే రోజు నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని.. లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి మంజూరు పత్రాలు ఇచ్చారు. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా పలు ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికే ముగ్గు పోసి ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లోనే బేస్మెంట్ స్థాయిని పూర్తిచేసుకోబోతున్నాయి. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కొత్త గైడ్లైన్స్ రిలీజ్ అయ్యాయి.
తొలి విడతలో స్థలం ఉన్నవారికి ప్రాధాన్యం
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హత కలిగిన వారినుంచి ప్రజాపాలన, గ్రామసభల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాల వారిగా అర్హుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం.. తొలి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో భాగంగా తొలి విడత నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి. తొలి విడతలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 72,045 మంది లబ్ధిదారులకు అధికారులు ఇళ్లను మంజూరు చేశారు. ప్రస్తుతం అర్హుల లిస్టు ప్రకటించిన గ్రామాలను మినహాయించి.. మిగిలిన అన్ని గ్రామాల్లో అర్హుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు. తొలి విడతలో ఖాళీ స్థలం ఉండి ఇండ్లు కట్టుకోవాలనుకునే పేదలకు ప్రాధాన్యం ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారు. అయితే.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందించనుంది.
ఇంటి నిర్మాణానికి ప్రారంభంలో (ఫౌండేషన్) రూ.లక్ష, బేస్మెంట్, ఫిల్లర్స్ లెవల్లో రూ.1.25లక్షలు, స్లాబ్ లెవల్లో రూ.1.75లక్షలు, ఇతర నిర్మాణాలు పూర్తవుతుంటే రూ.లక్ష ఇస్తామని, లబ్ధిదారుల ఖాతాలోనే నేరుగా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే.. తాజాగా.. ఇందిరమ్మ పథకానికి సంబంధించి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు కొత్త గైడ్ లైన్స్ పంపించింది. అయితే.. కొత్త గైడ్లైన్స్ ప్రకారమే నిర్మాణాలు జరగాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్మాణాలు ఉండాలని.. లేదంటే బిల్స్ నిలిపివేస్తామని హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలోని అధికారులకు కొత్త గైడ్లైన్స్ పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.
కొత్త గైడ్లైన్స్ ఇలా..
- ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభించే ముందు స్థలం ఫొటో తీయాలి.
- ఆ ఫొటోను ఇందిరమ్మ యాప్లో మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి.
- ఇంటి నిర్మాణ వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి.
- రెండు గదులు, ఒక వంటగది, బాత్ రూమ్ ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టాలి.
- ప్రతి దశలోనూ ఫొటోలు తీసి మొబైల్ ద్వారా ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేయాలి.
- వాటి ఆధారంగానే లబ్ధిదారులకు చెల్లింపులు ఉంటాయి.
- పాత ఇంటిని ఆనుకొని గానీ, ఇప్పటికే ఉన్న ఇంటికి అదనపు గదులుగా గానీ, కొంతవరకు కూల్చి వేసిన వాటికిగానీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయకూడదు.
- గతంలో నిర్మాణం ప్రారంభించి కొంతవరకు నిర్మించిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ పథకం మంజూరు చేయొద్దు.
- ఇండ్లను కలిపి కట్టుకోవడానికి అనుమతి లేదు.
- ఒక ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఇవ్వాలి.
వెయ్యి నిర్మాణాలు కాగానే బిల్స్ రిలీజ్...
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 26న మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 700 ఇళ్లు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తయినట్లు గృహనిర్మాణల శాఖ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని ప్రారంభ దశలో ఉన్నాయని.. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1,000 ఇళ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవల్కు రాగానే మొదటి దశ బిల్లులు విడుదల చేస్తామని చెబుతున్నారు. అలాగే.. బిల్లుల చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. సరిపడా నిధులు రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు పూర్తిచేయడమే తమ టార్గెట్ అన్నారు.