4 జిల్లాల్లో కొత్తగా డయాగ్నోస్టిక్ కేంద్రాలు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో త్వరలో మరో 4 తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి.

Update: 2024-10-10 02:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో మరో 4 తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనల ప్రకారం మన్ననూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరులలో నెలకొల్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న ప్రజలు అరగంట లోపే ఆస్పత్రులకు చేరుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేయగా, ఇప్పుడు నిర్ధారణ కేంద్రాలను దగ్గరలోకి తీసుకురావాలని వైద్యారోగ్యశాఖ ప్లాన్ చేసింది. మరోవైపు టీచింగ్ ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డులకు చర్యలు తీసుకున్నారు. ఆదివాసీ, గిరిజన భాషల్లో నైపుణ్యం కలిగిన మెడికల్ స్టాఫ్‌ను ఆయా వార్డుల్లో అందుబాటులో ఉంచనున్నారు. అంతే కాకుండా గర్భిణులను ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ కంటే ముందు ఆస్పత్రులకు తరలించడం, ట్రైబల్ ఏరియాల్లో బైక్ అంబులెన్స్ వంటి సౌకర్యాలను సైతం కల్పించనున్నారు. డిసెంబర్ లోపు ఇవన్నీ అందుబాటులో ఉండేలా వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తున్నది.

టెస్టులన్నీ ‘ఈజీ.’.?

ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే టీ హబ్స్‌లో పేదలకు ఉచితంగా టెస్టులు చేయనున్నారు. రక్త, మూత్ర తదితర 80 రకాల టెస్టులను ఫ్రీగా చేయనున్నారు. అంతే కాకుండా 24 గంటల్లోనే ఫోన్‌కు రిపోర్టులు వచ్చేలా టెక్నికల్ టీమ్స్‌ను నియమించనున్నారు. ఇక ఇమేజింగ్‌ సేవలైన ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌, సేటీ స్కాన్‌తో పాటు ఈసీజీ సేవలను నాలుగు ఐటీడీఏల్లో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. రేడియాలజిస్టులు అక్కడ అందుబాటులో లేకుంటే, టెలి కన్సల్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయిలోని టీహబ్‌లో ఒక మహిళకు అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ను టెక్నిషీయన్‌ చేస్తే, ఆ ఫలితాలను వెంటనే టెలికన్సల్టేషన్‌ ద్వారా రేడియాలజిస్టుకు పంపుతారు. ఆ రిపోర్టును పరిశీలించి తదుపరి మెడికేషన్ పై ఆయా డాక్టర్ సూచిస్తారు.


Similar News