MLA : తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుంది

తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా పాలన కొనసాగుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

Update: 2024-09-17 09:16 GMT

దిశ, మిర్యాలగూడ : తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా పాలన కొనసాగుతుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా మిర్యాలగూడ క్యాంపు కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన దేశానికి 1947 ఆగస్టు 15న భారతదేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 న ఆనాటి నిజాం పాలకులపై కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడి తెలంగాణ రాష్ట్రానికి విమోచన కలిగించిందన్నారు.

అలాగే మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన నుంచి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర విముక్తి పొంది ప్రస్తుతం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. కావున తెలంగాణ రాష్ట్రం అంతటా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య, స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్, పొదిళ్ల. శ్రీనివాస్, సైదులు, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News