కాలుష్య కోరల్లో నల్గొండ, సూర్యాపేట జిల్లాలు.. ఆ ఫ్యాక్టరీపై చర్యలెప్పుడు ?

అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా.. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని కొన్నిగ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Update: 2024-10-04 02:50 GMT

దిశ, హుజూర్ నగర్: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్ పహాడ్ గ్రామంలో చాణిక్య సిమెంట్ ఫ్యాక్టరీగా నిర్మించి.. తర్వాత దానిని పెన్నా సిమెంట్స్ గా మార్చారు. ఇటీవల పెన్నా గ్రూప్స్ ను ఆదాని గ్రూప్ స్వాధీనం చేసుకుని అంబుజా సిమెంట్ గా మార్చారు. కొన్ని రోజులుగా ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడే పొగ వల్ల సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యంతో ఉదర కోశ వ్యాధులు వస్తున్నాయని వాపోతున్నారు. 24 గంటలు పరిశ్రమ చిమ్ముతున్న దమ్ము,ధూళితో చుట్టుపక్కల ప్రాంతమంతా కాలుష్యమవుతుంది. ఇళ్లలో ఉండే పరిస్థితి కూడా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పేరుకి ఈ ఫ్యాక్టరీ నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ.. నష్టం మాత్రం సూర్యాపేట జిల్లా ప్రజలు అనుభవించవలసి వస్తుంది. పొగ నియంత్రించి తమను రక్షించాలని స్థానికులు వేడుకుంటున్నారు.

సిమెంట్స్ పొగ వల్ల నష్టపోయేది పాలకవీడు మండల ప్రజలే..

గతంలో ఉన్న పెన్నా ప్రస్తుతం అంబుజా సిమెంట్ పరిశ్రమ స్థలం భౌగోళికంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని గణేష్ పహాడ్ గ్రామంలో ఉన్నప్పటికీ దానికి సంబంధించిన మైనింగ్ ఎఫెక్ట్ సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని గ్రామాలపైనే అత్యధికంగా ఉంటోంది. ఈ ఫ్యాక్టరీకి వెళ్లాలన్నా, గణేష్ పహాడ్ వెళ్లాలన్నా పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్ గ్రామం నుండి వెళ్లవలసిందే. ఆ ఫ్యాక్టరీకి వెళ్లేందుకు మరో మార్గం లేదు. ఒకవైపు కృష్ణా నది, మరో వైపు మూసీనది ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీకి పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్, మహంకాళి గూడెం, గంగాభవానిపురం, రావి పహాడ్, జాన్ పహాడ్ దర్గా, కల్మడ్ తండా, జాన్ పహాడ్ గ్రామాలన్నీ అతి సమీపంలోనే ఉంటాయి.‌ ఆ పరిశ్రమ వల్ల ముఖ్యంగా నష్టపోయేది పాలకవీడు మండల ప్రజలే. ప్రస్తుతం అంబుజా సిమెంట్ వల్ల వచ్చే కాలుష్యం దట్టమైన పొగ దుమ్ము ధూళితో ఇండ్లలో ఉండే పరిస్థితి లేదని గత నెల రోజులుగా ఈ పొగలు దట్టమైన పొగలు చిమ్ముతున్నాయని గ్రామ ప్రజల వాపోతున్నారు. ఈ పొగ వలన అనారోగ్యానికి గురై హాస్పిటల్ కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమీప గ్రామాల ప్రజలు తెలిపారు.

గత కొంతకాలంగా ఆగి ఉండడం వల్లనే ఈ సమస్య..

పెన్నా సిమెంట్ పరిశ్రమ సుమారు 8 నెలలపాటు కొన్ని అనివార్య కారణాలవల్ల అపరిశ్రమ మూసి వేయడం జరిగింది. ఆ తర్వాత ఆ పరిశ్రమను ఆదాని గ్రూప్ స్వాధీనం చేసుకొని అంబుజా సిమెంట్ పరిశ్రమగా పేరు మార్చి ఇటీవల కాలంలో దానిని నడుపుతున్నారు. అప్పటినుంచీ ఈ పరిశ్రమ నుంచి దట్టమైన పొగలు బ్లాక్, బ్లూ రంగులతో పాటు గంటకో రంగులో పొగలు చిమ్ముతుందని సమీప గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.

బ్యాగ్ ఫిల్టర్ సమస్య వల్లనే ఈ కాలుష్యం..

కాలుష్యం వెలువడే పైపు లోపలి భాగంలో ఫిల్టర్ సిస్టమ్ ఉంటుందని (ఆర్ ఏ బి హెచ్) రివర్స్ ఎయిర్ బ్యాగ్ హౌస్ ఇది దెబ్బ తినడం వల్లనే ఈ కాలుష్యం బయటికి ఎక్కువగా చిమ్ముతుందని ఇంజినీరింగ్ విభాగం సంబంధించిన కొందరు వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. సిస్టమ్ సక్రమంగా పనిచేస్తే అందులోనే దుమ్ము ధూళిని బయటికి రాకుండా లోపలనే అడ్డుకుంటుందని ప్రస్తుతం ఆ బ్యాగ్స్ దెబ్బ తినడం వల్లనే ఈ సమస్య వెలుపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ పనిచేయకపోవడం వలన గాల్లోనే దుమ్ము, ధూళి బయటకు ప్రత్యక్షంగా రావడం వల్లనే ఇలా పొగలు చిమ్మినట్లుగా కనిపిస్తాయని తెలుపుతున్నారు. ఈ పొగలు ఇలాగే చిమ్మితే భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

దుమ్ము ధూళి తో నివసించే పరిస్థితి లేదు : మధు నాయక్ కాల్మేడ్ తండా

కొన్ని రోజులుగా గతంలో ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో ఉన్న ఫ్యాక్టరీ నుండి భారీగా దట్టమైన పొగలు వస్తున్నాయి. ఆ పొగలో రాత్రి వేళ బయట‌ పడుకుంటే దుమ్ము ధూళి మీద పడుతున్నాయి. ఇండ్లలో ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడూ ఏదొక ఆరోగ్య సమస్యతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ దుమ్ము ధూళి కారణంగా పంటలన్నీ నాశనం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి పొగ రాకుండా నియంత్రించాలని కోరుతున్నారు.

మా దృష్టికి రాలేదు.. చర్యలు తీసుకుంటాం : నల్గొండ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ సంగీత

సిమెంట్ నుండి కాలుష్యం వెలువడుతుందని ఎవరూ తమ దృష్టికి తీసుకురాలేదు. ఈ సమస్య ఇప్పుడే తమకు తెలిసింది. దీనిపై విచారణ జరిపి వారిపై ఈ పోగల కారణాలు ఇలా ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి పూర్తి వివరాలు తెలుసుకొని చర్యలు తీసుకుంటాం.

కోట్లలో ఆదాయం నల్గొండ జిల్లాకు.. నష్టం సూర్యాపేట జిల్లాకు ప్రజలకు.. ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. ఇది నల్లగొండ జిల్లా పరిధికి వస్తున్నప్పటికీ.. దీనికి నష్టం మాత్రం సూర్యాపేట జిల్లా ప్రజలు అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ మైనింగ్ కూడా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని శూన్య పహాడ్ ప్రాంతంలోనిదే. ఈ ఫ్యాక్టరీ కి వెళ్లే ప్రధాన రహదారి పాలకవీడు మండలంలోని రిజర్వ్డ్ ఫారెస్ట్ సైదుల్ నామా కింద ఉంది. ప్రతిదీ ఈ పరిశ్రమ కావాల్సిన వనరులన్నీ సూర్యాపేట జిల్లాకు పాలకవీడు మండలానికి చెందినవి.. కానీ ప్రతి సంవత్సరం ఫ్యాక్టరీ వాళ్లు మైన్స్ మినరల్స్ ద్వారా చెల్లించే ఆదాయపు పన్నులన్నీ నల్లగొండ జిల్లాకు చెందుతున్నాయి. ప్రతి సంవత్సరం వీళ్లు ప్రభుత్వానికి కోట్ల రూపాయల టాక్స్ కడుతున్నారు. దీనిపై గతంలోనే నష్టం మనకు జరుగుతుందని, ఆదాయం కూడా మన జిల్లాకే రావాలని ఆ గణేష్ పాడు గ్రామాన్ని ఒకటి సూర్యాపేట జిల్లాలో కలపాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు వాయిదా వేయాల్సి వచ్చింది.


Similar News