MLC Jeevan Reddy: రాష్ట్ర కాంగ్రెస్‌‌లోని పరిణామాలు జీర్ణించుకోలేకపోతున్నా: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

లొసుగులను వాడుకుని పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-24 07:09 GMT

దిశ, వెబ్‌‌డెస్క్: లొసుగులను వాడుకుని పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఫిరాయింపులకు పాల్పడకుండా నైతిక వలువలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా సరే ఫిరాయింపులకు పాల్పడితే తక్షణమే వారిపై అనర్హత వేటు పడాలని గతంలో తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారని గుర్తు చేశారు.

ఆనాడు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా దేశంలో ఒకే ఒక్క వ్యక్తి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ (Rajeev Gandhi) మాత్రమే పోరాటం చేశారని ఆయన ఎమోషనల్ అయ్యారు. నేడు లొసుగులను వాడుకుని పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయని ఫైర్ అయ్యారు. తెలివిగా అభివృద్ధి నెపంతో కొందరు పార్టీలు మారడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సుస్థిరంగా ఉందని పేర్కొన్నారు.

కానీ, పార్టీ ఫిరాయింపుల వల్ల క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ (Congress) కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని తాను లేఖ ద్వారా కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక్ గాంధీ (Priyanka Gandhi)లకు తెలిపానని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లోని పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని జీవన్‌రెడ్డి (Jeevan Reddy) స్పష్టం చేశారు. తీవ్ర మానసిక వేదనతో హైకమాండ్‌కు లేఖ రాస్తున్న.. కానీ ఇలా చేయాల్సి వస్తున్నందుకు విచారిస్తున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పదేళ్ల పాటు బీఆర్ఎస్ (BRS) నాయకుల అరాచకాలను అడ్డుకున్నానని, నేడు అదే ఆయకులు పార్టీలో చేరి కాంగ్రెస్ (Congress) కార్యకర్తలపై పెత్తనం చెలాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయింపులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) ముఠా నాయకులు కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డిని సంతోష్ (Santhosh) అనే యువకుడితో చంపించారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress)కు వ్యతిరేకంగా సంతోష్ పని చేశాడని ఆరోపించారు. గతంలో కూడా నిందితుడు బీఆర్ఎస్ నేతల (BRS Leaders) అండ చూసుకుని రెచ్చిపోయాడని, గంగారెడ్డి (Ganga Reddy)ని మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తన తరఫున ప్రతిపాదించానని గుర్తు చేశారు. ఎవరి అండ చూసుకుని గంగారెడ్డిని, సంతోష్ మట్టుబెట్టాడో అందరికీ తెలుసని జీవన్‌రెడ్డి అన్నారు.


Similar News