రవాణా శాఖపై పొన్నం రివ్యూ.. గైర్హాజరైన అధికారులపై మంత్రి సీరియస్..!

రవాణాశాఖ అధికారులు రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలని, ఆదాయ అన్వేషణలో విచక్షణ రహితంగా వేధింపుల వల్ల కాకుండా చట్ట

Update: 2024-06-11 15:24 GMT

దిశ, తెలంగాణ: రవాణాశాఖ అధికారులు రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలని, ఆదాయ అన్వేషణలో విచక్షణ రహితంగా వేధింపుల వల్ల కాకుండా చట్ట ప్రకారమే వ్యవహరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జిల్లాల్లో విధిగా వాహనాలు తనిఖీ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్రైమాసిక టాక్స్ వసూలుకు సంబంధించి తక్కువగా నమోదు చేసిన వివిధ జిల్లాల అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని మందలించారు.

రవాణా శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. అధికారులు హుందాగా వ్యవహరిస్తూ రవాణా శాఖ గౌరవాన్ని పెంచాలన్నారు. ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్న రవాణా శాఖ కార్యాలయాలకు సొంత భవనాల కోసం ల్యాండ్ సెర్చ్ చేయాలని సూచించారు. సీఎంతో చర్చించి సొంత భవనాల సమస్య పరిష్కరించుకుందామని హామీ ఇచ్చారు. అధికారులు ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. రవాణా శాఖకు సంబంధించిన వాహనాలను ఒకే గూటికి తీసుకొచ్చే విధంగా స్టిక్కరింగ్ ఉండేలా చూసుకోవాలన్నారు.

ప్రతి స్కూల్, కాలేజీ బస్సును తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రైవర్లకు, స్కూల్ బస్సులకు కచ్చితంగా ఫిట్నెస్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలన్నారు. రోడ్డు భద్రతపై కలెక్టర్, ప్రభావిత వ్యక్తులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. వారం రోజుల పాటు స్కూల్‌లు, కాలేజీల్లో ఈ కార్యక్రమాలు చేయాలని, ప్రతి విద్యార్థికి రోడ్డు భద్రతపై కనీస అవగాహన ఉండేలా చూసుకోవాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఉన్న చెక్ పోస్టులను ఎన్ ఫోర్స్ మెంట్‌ను మరింత బలపరిస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించారు.

సీజ్ అయిన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహరించాలని, వాహనాలను భద్రపరిచే ప్రదేశాలపై జిల్లా పోలీస్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. హైదరాబాదు ఆటో రిక్షాలపై ప్రస్తుతం ఉన్న పాలసీతో పాటు సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా పాలసీలు రూపొందించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ విషయంలో అవినీతికి ఆస్కారం లేకుండా డిసెంట్రలైజ్ ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనం చేయాలని సూచించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఏదైనా భిన్న ఆలోచన వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు.

గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం

సమావేశానికి గైర్హాజరైన అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అధికారులను ఆదేశించారు. సమావేశానికి అధికారులు విధిగా హాజరుకావాల్సిందేనన్నారు. ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని అధికారులను హెచ్చరించారు. అనంతరం 100 శాతం పన్ను వసూలు చేసిన జిల్లా అధికారులను అభినందించారు. సమావేశంలో స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాష్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ప్రవీణ్ కుమార్, రమేష్, మమత, జిల్లా రవాణాశాఖ అధికారులు, డీటీసీలు, ఆర్టీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Similar News