మిగులు భూములకు రెక్కలు.. అడ్డదారుల్లో అక్రమించుకునేందుకు స్కెచ్

భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు.

Update: 2024-09-27 12:49 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. విలువైన స్థలాలు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. ఎలాగైనా తమ పరం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తప్పుడు పత్రాలను సృష్టిస్తున్నారు. కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు నీళ్లొదిలేందుకు జంకడంలేదు. అధికారులు ఎప్పటికైనా చర్యలు తీసుకుంటారనే భయం వారిలో ఏ మాత్రం కనిపించడం లేదు.ఇందుకు నిదర్శనంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని అల్వాల్ లోని జొన్న బండలో మిగులు (యూఎల్సీ) భూములు నిలుస్తున్నాయి.రూ. కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయి.

వీటి విలువ రూ.350 కోట్ల పై మాటే..

అల్వాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 582,583లలో దాదాపు 27 ఎకరాల మిగులు (యూఎల్ సీ) భూములు ఉన్నాయి. ఈ భూముల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో రూ.350 కోట్లకు పైగా ఉందని అంచనా. ఈ ప్రాంతం జొన్న బండ గా ప్రసిద్ధి.ఇక్కడ పెద్ద బండలు ఉన్నందున కొందరు రాళ్లు కొట్టుకొని జీవనం సాగించేవారు.వారు నాలుగైదు ఎకరాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.అయితే మిగతా దాదాపు 20 ఎకరాల ఖాళీ యూఎల్ సీ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. అడ్డంగా అక్రమించిన మిగులు భూములను ప్లాట్లుగా విక్రయించి రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తు, కోట్ల రూపాయాలను గడిస్తున్నారు.

రాత్రికి రాత్రే రాళ్లు కొట్టిన గుంతలను మట్టితో నింపుతున్నారు. రేకుల బ్లూ షీట్లతో హద్దులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి యథేచ్చగా కబ్జా చేస్తున్నారు. ఎవరైనా ఇదేమిటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు.గత కొన్ని నెలలుగా అక్రమంగా అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ఓ ప్రముఖ స్కూల్ యాజమాన్యం యూఎల్ సీ స్థలాన్ని అక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

నోటీసులు కొందరికేనా..?

హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. యూ ఎల్ సీ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణ దారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే నోటీసులు పేద, మధ్య తరగతి కుటుంబాలకే ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో మిగులు భూములను అక్రమించి అపార్ట్ మెంట్లు, వాణిజ్య భవనాలు,విద్యా సంస్థలను నడుపుతున్న యజమానులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది.దీంతోపాటు రాత్రి రాత్రే కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ కబ్జాదారులకు అధికార యంత్రాంగం కొమ్ము కాస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అధికారులు భూ కబ్జాదారులతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నట్లు సమాచారం ఉంది. దీంతో భూ కబ్జాదారులు ఎలాంటి జంకు, భయం లేకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను అనుకొని ఉన్న అల్వాల్ లో రూ.350 కోట్ల ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు. ఇప్పటికైనా హైడ్రా స్పందించి రూ. కోట్ల విలువైన మిగులు భూములను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.


Similar News