ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో రచ్చ..

నిత్యం పెరుగుతున్న రద్ధీకి సరిపడే రహదారులు లేకపోవటం...

Update: 2024-09-25 13:32 GMT

దిశ, కాప్రా : నిత్యం పెరుగుతున్న రద్ధీకి సరిపడే రహదారులు లేకపోవటం... ఉన్న రహదారులను దర్జాగా ఆక్రమించుకోవటంతో రహదారుల పై రాకపోకలు సాగించాలంటే ప్రయాణికులు నానా ఇక్కట్లకు గురవుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కాప్రా సర్కిల్ అధికారులు ఫుట్ పాత్ ల ఆక్రమణల పై ఉక్కుపాదం మోపుతున్నారు. జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారులకు ఇరువైపుల ఉన్న ఫుట్ పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నారు. కుషాయిగూడ, ఇసీఐఎల్ తో పాటు నాచారం, మల్కాపూర్ ప్రాంతాల్లోని ఫుట్ పాత్ ల తొలగింపు కొనసాగుతోంది. బుధవారం మల్కాపూర్ శివహోటల్ సమీపంలోని ఫుట్ పాత్ ల తొలగింపులో రెచ్చిపోయిన అక్రమార్కులు పట్టణ ప్రణాళిక అధికారి, సిబ్బందిని అడ్డుకుని దౌర్జాన్యానికి పాల్పడ్డారు.

అధికారితో వాగ్వివాదానికి దిగి, విధి నిర్వహణలో ఉన్న అధికారుల పై దురుసుగా ప్రవర్తించి నానా హంగామా సృష్టించారు. దీంతో అధికారులు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు వారికి వార్నింగ్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని, రోడ్డును ఆక్రమించుకోవడమే కాకుండా వారి పై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అక్రమంగా ఫుట్ పాత్ లను ఆక్రమించుకుని, అధికారులకే సవాల్ విసురుతూ, దాడులకు వెనుకాడటం లేదు. పట్టణ ప్రణాళికాధికారులు పుట్ పాత్ ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మరి అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.


Similar News