బంగ్లాదేశ్​ తరహాలో ప్రజలు హైడ్రా కు వ్యతిరేకంగా తిరగబడతారు : కూకట్​పల్లి ఎమ్మెల్యే

బంగ్లాదేశ్​ ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసిన విధంగా

Update: 2024-10-01 12:39 GMT

దిశ, కూకట్​పల్లి: బంగ్లాదేశ్​ ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసిన విధంగా హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్​ ముద్దం నరసింహ యాదవ్​తో కలిసి మంగళవారం బోయిన్​ చెరువును సందర్శించారు. అనంతరం హరిజన బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ హైడ్రా న్యాయ స్థానం ఆదేశాలను, చట్టాలను సైతం గౌరవించని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని అన్నారు. నియోజకవర్గంలోని పేద ప్రజల జోలికి హైడ్రా వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.

తమ నివాసాలను కూల్చి వేస్తారన్న భయంతో బతుకుతున్నామని హరిజన బస్తీ వాసులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో తమ ఆవేదనను విన్నవించుకున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే రాజకీయ నాయకులపై ఎమ్మెల్యే ఘాటుగా విమర్శలు చేశారు. పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే భయపడి ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. సామాజిక మాధ్యమాలలో హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ నాయకులు నరేందర్ గౌడ్, ఇర్ఫాన్, మక్కాల నర్సింగ్, ఏజాజ్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News