అధికారుల పర్యవేక్షణ కరువు.. ప్రమాదాలు జరిగితే జవాబుదారి ఎవరు...

జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య విభాగం అధికారులు నిర్లక్ష్యం ప్రజలను ప్రమాదంలో పడేసే ప్రమాదం ఉంది.

Update: 2024-10-04 09:44 GMT

దిశ, కూకట్​పల్లి : జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య విభాగం అధికారులు నిర్లక్ష్యం ప్రజలను ప్రమాదంలో పడేసే ప్రమాదం ఉంది. మైనారిటీ తీరని బాలురు స్వచ్చ ఆటోలు తీసుకుని రోడ్ల పై తిరుగుతుంటే, పారిశుద్ధ్య విభాగం అధికారులు అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. స్వచ్చతా హీ సేవా 2024 అంటు నగరాన్ని శుభ్రం చేస్తున్నామని చెబుతున్న జీహెచ్​ఎంసీ అధికారులు స్వచ్చ ఆటోలను మైనర్​ బాలురు నడుపుతున్నా పట్టించోవడం లేదు. మూసాపేట్​, కూకట్​పల్లి జంట సర్కిళ్ల పరిధిలో చాలా వరకు స్వచ్ఛ ఆటోల పై మైనర్​ బాలురు విధులు నిర్వహిస్తూ కనిపిస్తున్నారు. మూసాపేట్​ సర్కిల్​ పరిధిలోని కేపీహెచ్​బీ కాలనీ 7వ ఫేజ్​ ఇందు ఫార్చున్​ ఫీల్డ్స్​ చెత్త సేకరించే ఆటో చెన్నయ్యకు అలాట్​ అయింది. ఆటోను మాత్రం మురళి అనే (15) సంవత్సరాల మైనర్ బాలుడు ఏకంగా సర్కిల్​ కార్యాలయం వద్దనే నడుపుతూ కనిపించాడు.

ఈ విషయాన్ని అక్కడే ఉన్న మూసాపేట్​ సర్కిల్​ పారిశుద్ధ్య విభాగం అధికారి దృష్టికి తీసుకు వెళ్లగా మళ్లీ తప్పు జరగకుండా చర్యలు తీసుకుంటాము అంటు సర్ది చెప్పేందుకు ప్రయత్నించడం గమనార్హం. అదే విధంగా ఆంజనేయ నగర్​ కాలనీ ఇండ్ల నుంచి చెత్తను సేకరించేందుకు చంద్రశేఖర్ అనే వ్యక్తికి అలాట్​ కాగా ఆటోను మైనర్​ బాలుడు రవి నడుపుతున్నాడు. సర్కిల్​ పరిధిలో చెత్త సేకరణతో పాటు కైత్లాపూర్​లోని డంపింగ్​ యార్డుకు చెత్తను తరలించే పనులలో, డంపింగ్​ యార్డు వద్ద చెత్త సెగ్రిగేషన్​ పనులలో చాలా మంది మైనర్​లు పని చేస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రమాదం జరిగితే జవాబుదారి ఎవరు..

జంట సర్కిళ్ల పరిధిలో చెత్తను సేకరించే స్వచ్చ ఆటోలను నడుపుతున్న మైనర్​ల కారణంగా ఏదైనా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంటే ప్రమాదం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి బాధ్యత తీసుకునే వారు ఎవరు. స్వచ్ఛ ఆటోల పై కనీసం పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు జవాబుదారిగా ఉంటారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


Similar News