ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు జవహర్ నగర్ గుర్తుకురాలేదా..?

హైదరాబాద్ నగరం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే సుందరీకరణ

Update: 2024-10-11 09:14 GMT

దిశ, జవహర్ నగర్: హైదరాబాద్ నగరం ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలంటే సుందరీకరణ కోసం ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి టక్కున గుర్తుకు వచ్చేది జవహర్ నగర్ ప్రాంతం. గత నాలుగు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో మూసి బాధితులను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగించారు. మూసీ నాలా పక్కల ఉన్న పేదలకు జవహర్ నగర్ లో వెయ్యి ఎకరాల భూమి కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. అది అలా ఉండగా గత 35 ఏండ్ల నుంచి నగరంలో సేకరించిన చెత్త మొత్తం జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించి, సేంద్రియ ఎరువులు, విద్యుత్ తో కోట్ల రూపాయలు ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుంది.

పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎన్నో వేల ఎకరాల భూములను కట్టబెట్టిన ప్రభుత్వం చివరకు రాష్ట్ర ఆర్టీసీ లో పనికిరాని బస్సులను సైతం జవహర్ నగర్ లో డంప్ యార్డ్ ఏర్పాటు చేసుకుంది. కానీ డంపింగ్ యార్డులతో ఇక్కడి ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న..ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. అరకొర వసతులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు దీన స్థితిలో ఉన్నాయని గతంలో మాజీ ఐఎఎస్ అధికారి, ప్రస్తుత విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ సైతం నివేదికతో గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగి, ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా జవహర్ నగర్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటును ప్రభుత్వం తొలి దశలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై స్థానికులు పలు విమర్శలు చేస్తున్నారు.

ఒకే క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పాఠశాలలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో 5000 కోట్లతో 'యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌' లను తొలి దశలో కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌ నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆంథోల్‌, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట, జడ్చర్ల నియోజకవర్గాల్లో భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు ఘనంగా నిర్వహింస్తున్నారు.అధికారులు ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు అనువైన స్థలాలను ఇప్పటికే 20 ఎకరాల చొప్పున భూమిని ప్రభుత్వం సేకరించి నేడు శంకుస్థాపనలు చేస్తున్న విషయం తెలిసిందే.,

రాష్ట్రం నుంచి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్, కేంద్రం నుండి నవోదయ స్కూల్ ఏర్పాటుకు డిమాండ్...

ప్రభుత్వ తీరు పట్ల మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు నిరాశకు లోనవుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ భూములకు కొదువ లేదని, 99% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన రెండు లక్షల మందికి పైగా నిరుపేద కుటుంబాలు, జవహర్ నగర్ తో పాటు డంపింగ్ యార్డ్ తో కాలుష్య భూతానికి తట్టుకుని 16 గ్రామాల పేద ప్రజల పిల్లలను దృష్టిలో ఉంచుకుని తొలి దశలోనే 'యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌' కోసం జవహర్ నగర్ ను గుర్తించక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు వాపోతున్నారు.

రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించిన చిన్నారులు పై చదువులకు నోచుకోవడం లేదు. కూలి పనులు చేసుకుని ఆర్థిక అసమానతలతో కొట్టుమిట్టాడుతూ పలు కాలనీల ప్రజలు దూరంగా ఉన్న అరకొర వసతులున్న పాఠశాలలో, కాలేజీల్లో తమ పిల్లలను చదివించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉపాధి లేక ఆర్థిక స్తోమత లేనందువలన చాలా మంది నిరుపేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్, అదే విధంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నవోదయ పాఠశాలను జవహర్ నగర్ లో ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ లు చొరవ తీసుకోవాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి వెంటనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్, నవోదయ పాఠశాల కోసం కృషి చేయాలని విద్యావేత్తలు, సామాజిక వేత్తలు, పలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News