అనుమతులు ఒకలా... నిర్మాణాలు మరోలా...

మూసాపేట్​ సర్కిల్​ అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారింది.

Update: 2024-09-14 12:26 GMT

దిశ, కూకట్​పల్లి: మూసాపేట్​ సర్కిల్​ అక్రమ నిర్మాణాలకు కేంద్రంగా మారింది. అనుమతులు ఒకలా తీసుకుని తమకు ఇష్టం వచ్చినట్టు బహుళ అంతస్థులను నిర్మిస్తూ కొంత మంది బిల్డర్​లు ప్రభుత్వ ఖజానాకు గండి పెడుతున్నారు. 12 నుంచి 15 ఫీట్ల రోడ్డులలో ఏకంగా 5 నుంచి 7 అంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టి జీహెచ్ఎంసీ ఖజానాకు గండి పెడుతున్నారు. ఒకటి రెండు కుటుంబాలు నివాసం ఉండాల్సిన భవనాలలో పరిమితికి మించి వ్యక్తులు నివాసం ఉంటుండడంతో డ్రైనేజి వ్యవస్థ, తాగునీటి సరఫరా, విద్యుత్​ కనెక్షన్​, ట్రాఫిక్​, రోడ్లపై అక్రమ పార్కింగ్​ ఇలా సమస్యల వలయంలో ఆయా కాలనీలు చిక్కుకుని ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

జీహెచ్ఎంసీకి సవాల్​ విసురుతున్న నిర్మాణదారులు..

మూసాపేట్​ సర్కిల్ పరిధిలోని కేపీహెచ్​బీ డివిజన్​, బాలాజీ నగర్​ డివిజన్​లలో అక్రమ నిర్మాణాల జోరు గత కొంత కాలంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. వంద గజాలు, రెండు వందల గజాల స్థలంలో ఏకంగా 5, 6, 7 అంతస్తుల వరకు నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారులు అధికారులకు పెద్ద సవాల్​గ మారారు. కేపీహెచ్​బీ టెంపుల్​ బస్టాప్​కు సమీపంలోని హెచ్​ఐజి కాలనీలో ఓ వ్యక్తి ఏకంగా ఆరు అంతస్థుల నిర్మాణం ఎటువంటి నిబంధనలు, సెట్​ బ్యాక్​లు లేకుండా నిర్మాణం చేపడుతున్నారు. భువజన విజయం మైదానం సమీపంలో కొందరు అనుమతలకు విరుద్దంగా 5,6 అంతస్థుల నిర్మాణం చేపట్టి జీహెచ్ఎంసీ అధికారులకు సవాల్​ విసురుతున్నారు.

పెరుగుతున్న భారం..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీగా పేరు గాంచిన కేపీహెచ్​బీ కాలనీ నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించింది. కాలనీలో ఎల్​ఐజి, ఎంఐజీ, హెచ్​ఐజీలుగా తరగతులును విడదీసి వంద గజాల నుంచి 300 గజాల వరకు ప్లాట్​లను కేటాయించి హౌసింగ్​ బోర్డు శాఖ అప్పట్లో 12 నుంచి 25 ఫీట్ల వరకు రోడ్లను కేటాయించి లేఔట్​ చేశారు. 12 ఫీట్ల రోడ్డులో నిర్మించిన బహుళ అంతస్థుల నిర్మాణాల కారణంగా తరచు డ్రైనేజి పొంగడం, తాగునీటి సరఫరా సరిపోక పోవడం, విద్యుత్​ సమస్యలు, ట్రాఫిక్​ సమస్యతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కొత్త డ్రైనేజీ వ్యవస్థ, తాగు నీటి పైప్​లైన్​ పనులు చేపట్టాలంటే ప్రభుత్వానికి ఇది అదనపు భారంగా మారింది. అసలు ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించిన భవనాలు ఉన్న కాలనీలలో ప్రజా ధనాన్ని వృద్ధా చేస్తు మౌలిక వసతులు కల్పించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


Similar News