వర్షాల ఎఫెక్ట్.. విజృంభిస్తున్న వ్యాధులు

ఎడతెరిపిలేని వానలతో పల్లెల్లు, పట్టణాలన్నీ వరదతో నిండిపోయాయి. కాలనీలు, బస్తీలు బురదమయం గా మారాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో నీళ్ళు నిలిచాయి. దీంతో దోమ లు విజృంభిస్తున్నాయి.

Update: 2024-09-03 02:36 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో: ఎడతెరిపిలేని వానలతో పల్లెల్లు, పట్టణాలన్నీ వరదతో నిండిపోయాయి. కాలనీలు, బస్తీలు బురదమయం గా మారాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో నీళ్ళు నిలిచాయి. దీంతో దోమ లు విజృంభిస్తున్నాయి. వాటి ధాటికి తట్టుకోలేక ప్రజలు మంచాన పడుతున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్న మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా.. మూడు రోజులు దంచికొడుతున్న భారీ వర్షాల వల్ల జ్వరాల బారిన పడి హాస్పిటల్స్‌కు క్యూ కడుతున్నారు. సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపం.. అస్తవ్యస్థ పారిశుధ్య నిర్వహణతో ఈ పరిస్థితి దాపురించిందని ప్రజలు మండిపడుతున్నారు. 

వ్యాధులతో సుస్తీ..

జిల్లాలో వ్యాధులు ముసురుకుంటున్నాయి. డెంగీ డేంజర్ బెల్స్ మోగుతుండగా, టైఫాయిడ్, చికున్ గున్యా, విష జ్వరాలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 450 కి పైగా కేసులు నమోదవగా, అనధికార లెక్కల ప్రకారం అంతకు రెట్టింపు ఉన్నట్లు సమాచారం. మేడ్చల్ మండలంలోని రావల్ కోల్ లో ఓ వ్యక్తి డెంగీతో మృతి చెందాడు. దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, విష జ్వరాల వంటి వ్యాధులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో ఫీవర్ సర్వేలో భాగంగా 3,71,514 ఇళ్లను విజిట్ చేసి, 13,37,450 మంది నుంచి రోగ నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇందులో 9వేలకు పైగా ప్రజలు జ్వరంతో బాధ పడుతున్నట్లు తేలింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు జనం బారులు తీరుతున్నారు.

వైద్యం కోసం రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. వ్యాధుల నివారణ, మెరుగైన వైద్యం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా వైద్యరోగ్యశాఖ ప్రకటనలకు, క్షేత్ర స్థాయిలో అమలుకు పొంతన ఉండడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం అలియాబాద్, శామీర్‌ పేట ఆసుపత్రులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వైద్యారోగ్య అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రుల నిర్వహణ, హాజరు పట్టిక, రికార్డుల నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవ లపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని చాలా వరకు ఆసుపత్రుల నిర్వహణ ఉంటుందని, కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందు లు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

పారిశుధ్యం అస్తవ్యస్తం

జిల్లాలోని 61 గ్రామాల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది. ప్రత్యేక అధికారులు పట్ట నట్టు వ్యవహరిస్తుండడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలు వృద్ధి చెంది, ప్రజలను కాటేస్తున్నాయి. దీని ద్వారా గ్రామీణులు మంచాన పడుతున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని గుంతల రోడ్లలో వర్షపు నీరు నిలిచి పోవడం, డ్రైనేజీల్లో దోమలు వృద్ధి చెంది రోగాలకు కారకులవుతున్నాయి. దోమల నివారణకు ఫాగింగ్ నామమాత్రంగా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి తోడు జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలున్నాయి. వాటి ద్వారా విడుదల చేస్తున్న వ్యర్థాలు డ్రైనేజీలు, చెరువుల్లో కురుస్తుండడంతో దోమల వృద్ధి వేగంగా జరుగుతోంది. ఇప్పటికే 400కు పైగా డెంగీ వ్యాధులు ప్రభలాయంటే పరిస్థితి ఇట్టే అర్థం అవుతోంది. డెంగీ సోకుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. పైగా డెంగీ కోసం కార్పొరేట్, ప్రైవేటు హాస్పిటల్‌లో చేరితే రూ. లక్షల్లో ఖర్చువుతుందని శామీర్ పేట‌కు చెందిన దిలీప్ పేర్కొన్నారు. వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News