అదనపు తరగతుల కోసం మున్సిపల్ ఆదాయానికి ఎగనామం..

విద్యాముసుగులో వ్యాపారం చేస్తూ కోట్లు పోగేసుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలు హైదరాబాద్ లో అడుగడుగునా దర్శనం ఇస్తాయి.

Update: 2024-09-30 14:48 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : విద్యాముసుగులో వ్యాపారం చేస్తూ కోట్లు పోగేసుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలు హైదరాబాద్ లో అడుగడుగునా దర్శనం ఇస్తాయి. పొలిటికల్ బ్యాగ్రౌండ్ తో అరంగేట్రం చేసిన పాఠశాలలు ఫీజుల రూపేణా లక్షల రూపాయలను ప్రజల నుండి గుంజుతూ కోట్లు పోగేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రైవేట్ పాఠశాలలు కాస్త కమర్షియల్ వాణిజ్య కేంద్రాలుగా మారి అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాలను మోసం చేస్తూ రాజభోగం అనుభవిస్తున్నాయి. డబ్బులతో అధికార వ్యవస్థలను, పొలిటికల్ లీడర్స్ ను కొంటున్న కమర్షియల్ స్కూల్స్ తాము చేసేదే చట్టంగా భావిస్తూ తమ ఇష్టానుసారం నడుచుకుంటున్నారు.

నిజాంపేట్ లో విజ్ఞాన్ బరితెగింపు...

నిజాంపేట్ కార్పొరేషన్ లో గల విజ్ఞాన్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తమ ఇష్టానుసారం అక్రమ భవంతులు, గదులు, భారీ షెడ్స్ నిర్మిస్తూ మున్సిపల్ వ్యవస్థలను అపహాస్యం చేస్తుంది. లక్షలు, కోట్లలో ఫీజులు దండుకుంటున్నప్పటికి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పెడుతూ చట్ట విరుద్ధంగా అక్రమ నిర్మాణాలను చేపడుతుంది. పూర్వ గ్రామ పంచాయతీ అనుమతులతో పాఠశాల భవంతి నిర్మాణం చేపట్టిన విజ్ఞాన్ స్కూల్, నేడు తెలంగాణ మున్సిపల్ చట్టాలను లెక్కచేయకుండా ఎడా పెడా భారీ నిర్మాణాలని చేపడుతుంది. గత సంవత్సరం క్రితం కూడా ఈ పాఠశాలలో నిజాంపేట్ మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో ఎలాంటి అనుమతులు లేకుండా అదనపు భవంతులు నిర్మాణం జరిగాయి. ఆ భవంతుల నిర్మాణంతో నిజాంపేట్ మున్సిపల్ ఆదాయానికి, ప్రభుత్వ వ్యవస్థలకు సుమారు ఒక కోటి రూపాయల పైనే గండి పెట్టి తమ పనులు కానిచ్చుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ పాఠశాల భవనానికి అనుమతులు పొందాలంటే ఎల్ఆర్ఎస్ క్లియర్ గా ఉండాలే, కానీ ఇక్కడ అలా కుదరదు. పాఠశాలలో పెద్ద మొత్తంలో అసైన్డ్ ల్యాండ్ ఉండడంతో ల్యాండ్ క్రమబద్దీకరణ జరగదు.

ఎల్ ఆర్ ఎస్ క్లియర్ గా లేనిచో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం చట్ట బద్దంగా అనుమతులు ఇవ్వడం కుదరదు. అలా విజ్ఞాన్ స్కూల్ పాఠశాలలో అదనపు భవంతులు, భారీ షెడ్స్ కు ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ -2019 ప్రకారం అనుమతులు రావు. కానీ మమ్మల్ని ఎవ్వరూ అడిగేది, మాకేది అడ్డు అనే ధోరణితో నిజాంపేట్ విజ్ఞాన్ స్కూల్ భారీ భవంతులు, పెద్ద స్థాయిలో షెడ్స్ నిర్మించి మున్సిపల్ చట్టాలకు సవాల్ విసరడం పౌరులను విస్మయానికి గురిచేస్తుంది. ఈ అక్రమ నిర్మాణాల పై స్థానికులు పలు మార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ నిజాంపేట్ టౌన్ ప్లానింగ్ అధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. స్థానికులు తరచుగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చెప్పట్టకాపోగా తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ లో షాడో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారిణి, ఓ స్థానిక ప్రజా ప్రతినిధి విజ్ఞాన్ స్కూల్ అక్రమాలకు అండగా నిలవడంతో ఈ అక్రమాల పర్వం నిరాటంకంగా కొనసాగుతుంది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ సౌజన్య...

విజ్ఞాన్ స్కూల్ లో అనుమతులు లేకుండా నిర్మించిన భారీ, భవంతులు, షెడ్స్ పై నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ ను దిశ వివరణ కోరగా.. ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్పొరేషన్ కు పూర్తి స్థాయిలో ఏసీపీ లేనందువల్ల టౌన్ ప్లానింగ్ వ్యవస్థ పని తీరు కాస్త నెమ్మదిగా ఉందని త్వరలోనే ఏసీపీ భాద్యతలు స్వీకరిస్తుందని, ఆ తర్వాత సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతానని తెలిపారు.


Similar News