విద్యార్థి మృతిపై బాలల హక్కుల కమిషన్ విచారణ

రంగారెడ్డి జిల్లాలోని నారాయణ బాసర సరస్వతి ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థి మృతి సంఘటనపై ఇంటర్ విద్యాధికారితో కలిసి క్యాంపస్ ను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పరిశీలించారు.

Update: 2024-10-24 16:06 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : రంగారెడ్డి జిల్లాలోని నారాయణ బాసర సరస్వతి ఐఐటీ క్యాంపస్ లో విద్యార్థి మృతి సంఘటనపై ఇంటర్ విద్యాధికారితో కలిసి క్యాంపస్ ను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు పరిశీలించారు. అధికారుల పరిశీలనలో ఆ రెసిడెన్షియల్ కాంపస్ కు ఎలాంటి అనుమతులు లేనట్లు గుర్తించారు. ఇందులో చదివే విద్యార్థులు 250 మంది ద్వితీయ సంవత్సరానికి చెందిన మేడ్చల్ జిల్లా బాచుపల్లి నారాయణ విద్యాసంస్థలకు (59319) చెందిన వారుగా గుర్తించినట్టు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేని, కనీస సౌకర్యాలు, పర్యవేక్షణ లేకుండా ఐఐటీ శిక్షణ పేరుతో నడుస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

     అదే విధంగా విద్యార్థుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా రాత్రి పది గంటల వరకు క్లాసులు నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ విద్యాసంస్థ నిర్లక్ష్యం వల్ల ఐదవ అంతస్తులో ఉన్న శివకుమార్ రెడ్డి అనే విద్యార్థి స్నేహితులతో కలిసి కిటికీ ద్వారా బయటకు వెళ్లే క్రమంలో కాలు జారి పడిపోవడంతో చనిపోయినట్టు అక్కడ ఉన్న సిబ్బంది తెలిపారు. ఈ విషయాలపై ప్రిన్సిపాల్, ఏజీఏంలను ఆరా తీయగా విద్యార్థి మృతి చెందిన రోజు రాత్రి పది గంటల వరకు క్లాసులు నిర్వహించామని, 12 గంటల సమయంలో విద్యార్థి కాలుజారి బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడని తోటి విద్యార్థులు తమకు ఫోన్ చేయటంతో హాస్పిటల్ కు తరలించగా మృతి చెందినట్టు తెలిపారు.

     దాంతో ఎలాంటి అనుమతులు, కనీస సౌకర్యాలు, పర్యవేక్షణ లేకుండా ఎలా నడుపుతున్నారని ప్రిన్సిపాల్, ఏజీఏం లపై కమిషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై తగు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థి మృతి సంఘటనపై కమిషన్ సుమోటోగా తీసుకుని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయనున్నామని తెలిపారు. ఈ తనిఖీలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్ రావు, అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News