చెరువులు కలుషితం.. చేపలకు ప్రాణసంకటం

ఒక పక్క రసాయన వ్యర్థ జలాలు.. మరోపక్క మురుగునీరు చెరువుల్లో

Update: 2024-09-14 13:55 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో: ఒక పక్క రసాయన వ్యర్థ జలాలు.. మరోపక్క మురుగునీరు చెరువుల్లో కలుస్తుండటంతో కోట్లాది రూపాయల విలువచేసే చేపలు మృత్యువాత పడుతున్నాయి. వీటితోనే జీవనోపాధి పొందుతున్న ఫిషరీస్ సొసైటీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇటీవల కాలంలో తరచుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉన్న పలు చెరువులలో లక్షలాది చేపలు చనిపోవడానికి ప్రధాన కారణం మురుగు, రసాయన జలాలే కారణమని అధికారులు పేర్కొంటున్నారు.

నిండా ముంచుతున్న రసాయనాలు..

జిల్లాలో 620 చెరువులు ఉండగా, వాటిల్లో 80 శాతం చెరువులు కలుషితమవుతున్నాయి. పరిశ్రమల వ్యర్థాలు, భవన నిర్మాణాల వ్యర్థాలు చెరువులలో కలుస్తున్నాయి. అయితే ఆయా చెరువులను ఆక్రమిస్తూ.. వాటి పరిసర ప్రాంతంలో వెలసిన చిన్న చిన్న పరిశ్రమలు కొకొల్లలు. సాల్వెంట్స్ గోదాములు, శుద్ధికరణ పరిశ్రమలు, రీసైక్లింగ్ కంపెనీలు పుట్టగొడుగుల్లా నెలకొన్నాయి.. ఈ పరిశ్రమలలో శుద్ధికరణ కోసం లేదా ఇతరత్రా సమయాలలో ఉపయోగించే రసాయన పదార్థాలు నేరుగా చెరువులోకి వదలటం, చెరువు వద్ద పారబోయుట వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదకర రసాయనాలు చెరువు నీటిలో కలవడంతో చెరువులలో ఉన్న చేపలు చనిపోవడం నిత్యకృత్యంగా మారుతోంది.

రీసైక్లింగ్ యూనిట్స్ దే పెద్ద పాత్ర..

చెరువుల వెంట అధిక సంఖ్యలో రీసైక్లింగ్ యూనిట్స్ నెలకొల్పటంతో చెరువులు ఎక్కువగా కలుషితమవుతున్నాయి. ఈ రసాయనాలు గొలుసు కట్టు కలువాల ద్వారా ఒక చెరువు నుండి మరొక చెరువులోకి చేరుతున్నాయి. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు పరివాహక ప్రాంతంలో ఓ వ్యక్తి పెద్ద ఎత్తున మెడికల్ వేస్ట్ ను తీసుకువచ్చి వాటిని రీసైక్లింగ్ చేయడం, వ్యర్థాలను చెరువు వద్దనే డంపింగ్ చేయడం వంటివి చేస్తున్నారు.. అదేవిధంగా మరొక వ్యక్తి చెరువు భూమిని ఆక్రమించి మరీ సదరు వ్యక్తి సాండ్ బ్లాస్టింగ్ చేస్తూ చెరువు నీటిని కలుషితం చేస్తున్నాడు. ఇంత జరిగిన పొలుష్యన్ కంట్రోల్ బోర్డు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.చెరువుల కలుషీతంపై పలుమార్లు మత్స్య సహకార సంఘాలు పీసీబీకి ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

శుద్ధి చేయకుండానే చెరువుల్లోకి..

ఇక పోతే జిల్లాలో చెరువుల చుట్టూ పెద్ద ఎత్తున బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతున్నాయి. బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ లను ఆక్రమించుకుని నిర్మిస్తున్నాయి. ఆయా నివాసాల కు సంబంధించిన మురుగునీరు ఎటువంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే చెరువుల్లో కలవడం తో ఎక్కువ మొత్తంలో చెరువులు మురుగునీటి కూపాలుగా మారిపోయాయి. వాస్తవంగా బహుళ అంతస్తుల నిర్మాణాల నుంచి వచ్చే పరుగు నీటిని ఎస్టిపి ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన తర్వాతనే బయటకు వదలాల్సి ఉంటుంది. కానీ అటువంటివి జరగకుండానే చెరువులను మురుగునీరు కలిసిపోతుంది. అంతేకాకుండా కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు సైతం ఇదేవిధంగా ఎస్టీపీ ప్లాంట్ల ద్వారా శుద్ధి కాకుండా అని చెరువుల్లో కలిసిపోతున్నాయి. దీంతో చెరువుల్లోని నీరు కలుషితమై జీవ రాశి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది.

ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతోనే..

జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువులో వేలాది సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ విషయంపై శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మత్స్య శాఖ అధికారి పూర్ణిమ చెరువు ని సందర్శించారు. చెరువులో అధిక శాతం రసాయనాలు కలవడం తోపాటుగా మురుగు నీరు వచ్చి చేరుతుందని, దీంతో నీటిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతోని చేపలు చనిపోతున్నాయని అంచనాకు వచ్చారు. తరచుగా చెరువులోని చేపలు చనిపోతూ వస్తుండడంతో ఫిషరీస్ సొసైటీలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలే పునరావృతమైతే దీన్నే ఆధారంగానే జీవనోపాధి పొందుతున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందని మత్స్య సహకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చెరువుల్లోకి వ్యర్థాలు కలువకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News