ఇంటి పన్నులు తగ్గించాలి.. సీడీఎంఏ డైరెక్టర్ కు విజ్ఞప్తి..
ఇంటి పన్నులు అధికంగా విధించడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, పునఃపరిశీలించి ఇంటిపన్నులు తగ్గించాలని సీడీఎంఏ డైరెక్టర్ కు 16 వ ఆర్థిక సంఘం సమావేశంలో పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు.
దిశ, మేడిపల్లి : ఇంటి పన్నులు అధికంగా విధించడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని, పునఃపరిశీలించి ఇంటిపన్నులు తగ్గించాలని సీడీఎంఏ డైరెక్టర్ కు 16 వ ఆర్థిక సంఘం సమావేశంలో పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులతో 16 వ సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పాణగారియా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్ పాల్గొన్నారు. కార్పొరేషన్ తరపున పలు అంశాలు ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. యానిమల్ బర్త్ కంట్రోల్ కోసం తమ పట్టణ స్థానిక సంస్థ(యూఎల్బీ) నుంచి ఒక్కో దానికి దాదాపు రూ.1,600 ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ జనాభా 55,000గా ఉందని, అయితే ఇప్పుడు జనాభా దాదాపు 1,25,000 పెరిగినట్టు అంచనా ఉందని తెలిపారు. జనాభా అంచనాలకు తగ్గట్టుగా మున్సిపల్ కార్పొరేషన్కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. యూఎల్బీ బడ్జెట్ నుంచి ప్రతి ఏడాది 10 శాతాన్ని గ్రీన్ బడ్జెట్గా కేటాయిస్తున్నట్లు చెప్పారు.
దీనికి సైతం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ప్రోత్సాహకం నిధులు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు అన్యాక్రాంతం కాకుండా జియోఫెన్సింగ్ చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన సాంకేతికతను యూఎల్బీకి కేంద్రం అందించాలని, జియోఫెన్సింగ్ కోసం అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని విజ్ఞప్తి చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవెలప్మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఎన్డీపీ)లో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యక నిధులు విడుదల చేయాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ని కోరారు. ఇంటి పన్నులు అధికంగా విధించడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నందున, ఇంటి పన్నులను పునఃపరిశీలించి, తగ్గించాలని సీడీఎంఏ డైరెక్టర్కు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అమ్రాపాలి, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.