ఆక్రమణదారులకు అనుకూలంగా ప్రొసిడింగ్స్..

తప్పుడు ప్రొసీడింగ్ ఆర్డర్ లతో అసలైన కౌలు దారుల నుంచి భూమిని అక్రమంగా సొంతం చేసుకొని విల్లాలు నిర్మించాలని ప్రణీత్ ప్రణవ్ నిర్మాణ సంస్థ పై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

Update: 2024-07-03 13:06 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : తప్పుడు ప్రొసీడింగ్ ఆర్డర్ లతో అసలైన కౌలు దారుల నుంచి భూమిని అక్రమంగా సొంతం చేసుకొని విల్లాలు నిర్మించాలని ప్రణీత్ ప్రణవ్ నిర్మాణ సంస్థ పై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట గ్రామంలో ప్రణీత్ ప్రణవ్ లిప్ కన్స్ట్రక్షన్ చట్టబద్ధమైన కవులు దారుల భూమిని ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో పిటి రిజిస్టర్ నుండి తొలగించి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న అంశంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశం పై బాధితులు ఇప్పటికే పోలీసులను, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

చదువు రాని వ్యక్తి సంతకం ఎలా..?

మల్లంపేట సర్వేనెంబర్ 121, 122 లలో 1.34 ఎకరాల భూమి తన తండ్రి కాలం నుంచి రాములు అనే వ్యక్తి వారసత్వంగా కౌలు చేసుకోవడం రెవెన్యూ రికార్డులు కూడా నమోదయి ఉండేదని చెబుతున్నారు. పిటి రిజిస్టర్ నుంచి కౌలురైతైన రాములు పేరు తొలగించడానికి, పిటి యాక్ట్ 1950 నిబంధనలకు వ్యతిరేకంగా చదువు రాని ఏంబరి రాములు ఏ విధంగా సంతకం చేస్తాడు అని ప్రశ్నిస్తున్నారు. వేలిముద్ర వేయకుండా, ఇంగ్లీషులో సంతకం ఫోర్జరీ చేసి కొందరు వ్యక్తులు అప్పటి ఎమ్మార్వోకి పిటి రిజిస్టర్ నుంచి రాములు తన పేరును తొలగించమని లెటర్ రాయడంతో, పిటి రిజిస్టర్ నుంచి రాములు పేర్లు తొలగించారు. ఇందుకు అప్పటి కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో పూర్తిగా సహకరించారని ఆరోపిస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు..

కౌలుదారుడైన ఎంబరీ రాములు సంతకం ఫోర్జరీతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని డాక్యుమెంట్ నెంబర్ 6722/2016, 8897/2016&8896/2016 ప్రణీత్ ప్రణవ్ లీఫ్ కన్స్ట్రక్షన్ గ్రూప్ కు అమ్ముతున్నట్లుగా అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని, అమ్ముతున్నట్టు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు తప్పుడు పత్రాలతో హెచ్ఎండీఏ నుంచి 2018 లో విల్లాల నిర్మాణానికి అనుమతులు తీసుకోవడం, నిర్మాణాలు జరగటం అమ్మకాలు కూడా చేశారని బాధితులు చెబుతున్నారు. ఈ విషయం పై 2002 జనవరి నెలలో దుండిగల్ పోలీసులకి ఫిర్యాదు చేశామని, అదేవిధంగా ప్రణీత్ ప్రణవ్ లీఫ్ లో సర్వేనెంబర్ 121, 122 లో ఉన్న ఒక ఎకరం 34 గుంటల భూమిలో నిర్మించిన 30 నిర్మాణాలకు లీగల్ నోటీసులు అందజేశారని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఉన్న కొందరు పెద్దల సహకారంతోనే ఫోర్జరీ సంతకాలతో భూమిని కొట్టేసి అందులో నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపట్టిందని బాధితులు ఆరోపిస్తున్నారు. మల్లంపేట ప్రణీత్ ప్రణవ్ లీఫ్ కన్స్ట్రక్షన్ పై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషుల పై చర్యలు తీసుకొని నిజమైన కౌలుదారులకి అదేవిధంగా వివాదాస్పద భూమిలో నిర్మాణాలను కొనుక్కున్న యజమానులకు సైతం న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News