వట్పల్లి ఎస్ఐ లక్ష్మణ్ పై బదిలీ వేటు..
కాంగ్రెస్ పార్టీ నాయకుడి జన్మదిన వేడుకలను పోలీస్స్టేషన్లో నిర్వహించడంతో ఎస్ఐ పై బదిలీ వేటు పడింది.
దిశ, అందోల్ : కాంగ్రెస్ పార్టీ నాయకుడి జన్మదిన వేడుకలను పోలీస్స్టేషన్లో నిర్వహించడంతో ఎస్ఐ పై బదిలీ వేటు పడింది. ఆదివారం వట్పల్లి మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ జ్యోషి జన్మదిన వేడుకలను వట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లక్ష్మణ్, సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియా, పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. కథనాల ఆధారంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారి హైదరాబాద్ రెంజ్ ఐజీ సత్యనారాయణ స్పందించి ఎస్ఐని ఐజీ కార్యాలయానికి ఆటాచ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్ఐ గత నెల రోజుల క్రీతమే వట్పల్లి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి జన్మదిన వేడుకలను నిర్వహించినందుకు బదిలీ వేటు పడాల్సి వచ్చింది. ఇదిలావుండగా పోలీస్ స్టేషన్లో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఎస్ఐతో పాటు పాల్గొన్న సిబ్బంది పై కూడా విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఇంటలిజేన్స్ అధికారులు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లపై జన్మదిన వేడుకల పై వారి పాత్ర గురించి విచారించినట్లు సమాచారం. ఈ ఘటనలో పాల్గొన్న సిబ్బంది పై కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది.