రైతులను మోసం చేసిన రియల్ వ్యాపారులను వదలొద్దు
అందోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో రైతులను నమ్మించి మోసం చేసి రూ.కోట్లు కొల్లగొట్టి పరారీ అయిన రియల్ వ్యాపారీని వదిలిపెట్టవద్దని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, అందోల్ : అందోలు రెవెన్యూ డివిజన్ పరిధిలో రైతులను నమ్మించి మోసం చేసి రూ.కోట్లు కొల్లగొట్టి పరారీ అయిన రియల్ వ్యాపారీని వదిలిపెట్టవద్దని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆ రియల్ దొంగ ఎవరనే చర్చ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. అతను ఎవరన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 18వ తేదీన ‘రైతులను ముంచిన రియల్ దొంగలు’ అనే కథనం దిశ దినపత్రికలో ప్రధాన శీర్షికన ప్రచురితమైంది. ఈ కథనం నియోజకవర్గ వ్యాప్తంగా సర్వత్రా చర్చకు దారి తీసింది.
ఈ కథనంపై ఇంటలిజేన్స్ అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం నుంచే ఇంటలిజెన్స్ అధికారులు రైతులను ముంచిన రియల్ వ్యాపారీ ఎవరు? ఎంత మంది రైతులు మోసపోయారన్న వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అధికారుల విచారణలో ఒకే గ్రామంలో సుమారు 9 మంది బాధిత రైతులు ఉన్నట్లు గుర్తించారు. సదరు రియల్ వ్యాపారీ చేతిలో మోసపోయిన రైతుల వివరాలను సేకరిస్తున్నారు. కొందరి బాధిత రైతులకు ఫోన్ లు చేసి మరీ వివరాలు సేకరించినట్లు సమాచారం. ఆయనకు అండగా నిలుస్తున్న లీడర్లు ఎవరన్నది ఆరా తీస్తున్నారు.
త్వరలో పోలీస్ స్టేషన్ కు బాధితులు?
రియల్ వ్యాపారి చేతిలో మోసపోయిన రైతులు పోలీసులను ఆశ్రయించనున్నట్లు తెలిసింది. దిశ కథనం అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ఒక్కొక్కరుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రియల్ వ్యాపారికి అండగా ఉంటున్న లీడర్లను చూసి భయపడి బాధిత రైతులు బయటపడినట్లు తెలుస్తోంది. తమకు న్యాయం జరిగేలా అండగా నిలవాలని బాధిత రైతులు స్థానిక నేతలను కోరుతున్నారు.