మరోసారి సత్తా చూపించిన తెలంగాణ మందుబాబులు.. దసరా రోజున ఎంత మద్యం తాగారో తెలుసా?

తెలంగాణ(Telangana)లో అత్యంత ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో దసరా(Dussehra) ఒకటి. బతుకమ్మ, దసరా పండుగలు రెండూ ఒకేసారి రావడంతో పిల్లాపాపలతో కలిసి గ్రామాలకు వెళ్లి వైభవంగా జరుపుకున్నారు.

Update: 2024-10-14 12:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో అత్యంత ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో దసరా(Dussehra) ఒకటి. బతుకమ్మ, దసరా పండుగలు రెండూ ఒకేసారి రావడంతో పిల్లాపాపలతో కలిసి గ్రామాలకు వెళ్లి వైభవంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే బంధువులను పిలిపించుకొని చుక్క, ముక్కతో ఎంజాయ్ చేశారు. అలాగే ప్రతీ దసరా లాగే ఈసారి కూడా తెలంగాణ మందుబాబులు సత్తా చూపించారు. రికార్డుస్థాయిలో మద్యం తాగేశారు. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా మద్యం అమ్ముడైనట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. గత 10 రోజుల వ్యవధిలో 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగినట్లు పేర్కొన్నారు.

ఈ మద్యం అమ్మకాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టాప్‌లో నిలిచిందని తెలిపారు. ఆ తర్వాతి స్థానాల్లో కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో 2024 సెప్టెంబర్ 30 వరకు 2,838.92 కోట్ల అమ్మకాలు జరగ్గా.. అక్టోబర్ 01 నుంచి 11వ తేదీ వరకే ఏకంగా వెయ్యి కోట్ల మార్కు దాటినట్లు సమాచారం. మధ్యలో అక్టోబర్ 02న గాంధీ జయంతి వచ్చినా.. ఆ గ్యాప్‌ను మందుబాబులు పూడ్చేసినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం.. ఒకటో తారీఖు నుంచి 11వ తేదీ వరకు 1057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు జరిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే గతేడాది కంటే ఈసారి అమ్మకాలు 20 శాతం పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. గతేడాది దసరాకు రూ.877 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు చెప్తున్నారు.


Similar News