మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం అదే.. KTR ఆసక్తికర ట్వీట్

కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2024-07-02 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం అన్నారు. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం అని తెలిపారు. తలాపున గోదారి గలగల పారుతున్న తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచనం కాళేశ్వరం అని పేర్కొన్నారు.

సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతలే శరణ్యం అని స్పష్టం చేశారు. దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటాలకు సమాధానం కాళేశ్వరం అన్నారు. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్ సాగర్‌కు పునరుజ్జీవమిచ్చిన పుణ్య వరం కాళేశ్వరం అని కొనియాడారు. నీళ్లు రాక.. ఒట్టిపోయిన నిజాంసాగర్‌కు నిండుకుండలా మార్చే అండ దండ కాళేశ్వరం అన్నారు. మండుటెండల్లో చెరువులను మత్తళ్లు దూకించిన మహత్యం కాళేశ్వరం అని పేర్కొన్నారు.

మా తపనకు..ఆలోచనకు .. అన్వేషణకు జలదౌత్యానికి.. నిదర్శనం కాళేశ్వరం .. కాళేశ్వరం అంటే ఒక్క బరాజ్ కాదని తెలియని మీ అజ్ఞానం అంటూ ఫైర్ అయ్యారు. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం సరిదిద్దుకోగలం అని తెలిపారు. రాజకీయ కుళ్ళు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం అని ధీమా వ్యక్తం చేశారు. మీ ఏడుపే మా ఎదుగుదల అని కేటీఆర్ ట్వీట్ చేశారు.  

Similar News