ఉదయం సీజ్.. మధ్యాహ్నం ఓపెన్.. ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆదేశాలు బేఖాతరు

జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తా సమీపంలోని గణేష్ భవన్ ఉడిపి

Update: 2024-10-14 10:06 GMT

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తా సమీపంలోని గణేష్ భవన్ ఉడిపి హోటల్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఆదివారం టిఫిన్ పార్సిల్ తీసుకువెళ్లిన ఓ మహిళకు ఇడ్లీలో జెర్రీ రావడంతో హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మహిళ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనూష సోమవారం హోటల్ లో తనిఖీ చేశారు. అనంతరం నిబంధనల మేరకు నిర్వహణ తీరు లేకపోవడంతో హోటల్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. నివేదికను తయారు చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని అన్నారు. ఇంత వరకు బాగానే ఉన్న ఉదయం తనిఖీల అనంతరం హోటల్ సీజ్ చేసి అధికారులు వెళ్ళగానే హోటల్ ను ఎప్పటిలాగే నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

పక్కనే పైకి వెళ్ళడానికి ఉన్న మరో గేట్ ద్వారా సర్వీస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ముందు వైపు సీజ్ చేసినట్లే కనిపిస్తుండగా లోపల మాత్రం ఫుడ్ సప్లై చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల ఆదేశాలు కూడా లెక్క చేయరా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హోటల్ నిర్వాహకులు మాత్రం లోపల తింటున్నది కస్టమర్లు కాదని తమ దగ్గర పనిచేసే సిబ్బంది అని చెప్పడం గమనార్హం. హోటల్ సిబ్బంది అయినా మరెవరైనా సీజ్ చేసినప్పుడు లోపలికి ఎలా వెళ్ళానిచ్చారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Similar News