మంత్రి కోమటి రెడ్డికి మతిమరుపు ఎక్కువైంది: హరీష్ రావు

మంత్రి కోమటి రెడ్డికి మతి మరుపు ఎక్కువ అయినట్లు ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎద్దేవా చేశారు.

Update: 2024-09-24 16:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కోమటి రెడ్డికి మతి మరుపు ఎక్కువ అయినట్లు ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఎద్దేవా చేశారు. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో మంగళవారం హరీష్ రావు నివాసంలో త్రిబుల్ ఆర్ బాధితులు, రైతులు కలిశారు. త్రిబుల్ ఆర్ పై ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చి మాట తప్పిన వైఖరిని వివరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఉత్తర దిక్కు త్రిబుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిలుపుకోవాలన్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచార సభలో బాధితులకు ప్రియాంక గాంధీ చే హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం అన్నారు. త్రిబుల్ ఆర్ ఏర్పాటులో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలో మీటర్లను పరిగణలోకి తీసుకొని జంక్షన్ ఏర్పాటు చేయడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మధ్య నుండి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతున్నదనీ, బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నారు.

చౌటుప్పల్ వద్ద జంక్షన్ రింగు గతంలో 78 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 184 కు పెంచడం వల్ల పేదల భూములు, ప్లాట్లు కోల్పోతున్నారని, దీనికి నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారన్నారు. దక్షిణ భాగాన త్రిబుల్ ఆర్ కోసం ఎలాగైతే 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకుంటున్నారో, ఉత్తర బాగానే ఉన్న చౌటుప్పల్ వైపు 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి... బాధితులతో కలిసి త్రిబుల్ ఆర్ మార్చాలని, రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారని, పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ అలైన్మెంట్ మార్చుతామని హామీలు ఇచ్చారన్నారు. కానీ, ఇప్పుడేమో అదే పోలీసు బలగాలతో, నిర్బంధంగా రోడ్డుకు 28 కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి, ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని బలవంత పెట్టడం దుర్మార్గం అన్నారు. ఇదెక్కడి న్యాయం... ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటనా?.. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చారని మండిపడ్డారు. నాడు త్రిబుల్ ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్పుఅని నేడు మాట మార్చారని దుయ్యబట్టారు.

జిల్లా మంత్రిగా, శాఖ మంత్రిగా ఉండి నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రజలకు న్యాయం చేస్తావా? చరిత్ర హీనుడుగా మిగుపుతావా? ఆలోచించుకోవాలని సూచించారు. మీ మాటలు ప్రజలు నమ్మడం లేదని, ప్రియాంక గాంధీచే హామీలు చెప్పించి యధావిధిగా మాట తప్పారన్నారు. అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. విమర్శలు ఆపి.. ఇచ్చిన మాట నిలబట్టుకోవాలని సూచించారు. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రియాంక గాంధీ అయినా ఇచ్చిన మాట మీద నిలబడతారా? లేదా కాంగ్రెస్ నైజమే ఇంత అని మాట తప్పుతారా? అని నిలదీశారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే బాధితుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.

 


Similar News