గ్రానైట్‌ మాఫియా గుప్పిట్లో సన్యాసి మఠం..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు.

Update: 2024-10-10 02:41 GMT

దిశ, కరీంనగర్ రూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాంల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తుంటాయి. అంతటి ప్రఖ్యాతి గాంచిన పూర్వ కళా సంపదను కొందరు అక్రమార్కులు గ్రానైట్ రాళ్ళ కోసం గుళ్ళు,గోపురాలను సైతం వదలకుండా అక్రమ సంపాదన కు అలవాటు పడి కొల్లగొడుతున్నారు. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలోని 400 ఏళ్ల చరిత్ర గల పురాతనమైన సన్యాసి మఠాన్ని ఓ గ్రానైట్ మాఫియా చేతిలో కనుమరుగవుతుంది. గ్రానైట్ కోసం గుట్టను బాంబులతో పేలుస్తుండటంతో పక్కనే ఉన్న హనుమాన్ దేవాలయం, సన్యాసి మఠానికి పగుళ్లు వచ్చి శిథిలావస్థకు చేరుకుంది.

ఇదేంటని ప్రశ్నించిన కొందరి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రాంతానికి ఎవరిని వెళ్లనివ్వకుండా దారికి అడ్డంగా గేటు నిర్మించి సెక్యూరిటీతో రౌడీయిజం చేస్తున్నట్లు కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. అంతే కాకుండా అక్కడే ఉన్న నాగులకుంట చెరువులో బండ రాళ్లు వేస్తూ, డస్ట్ తో పూడ్చేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడి కోటలు, అద్భుత శిలా సంపద ఇప్పుడు కొంత మంది అక్రమార్కుల చేతిలో ఆనవాళ్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్రానైట్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, పురాతనమైన కట్టడాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News