కేఏ పాల్ పిటిషన్ ..ఫిరాయింపు ఎమ్మెల్యలకు హైకోర్టు నోటీసులు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

Update: 2024-09-23 09:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుకే ఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ  పిటిషన్ వేశారు. ఒక పార్టీ నుంచి పోటీ చేసి మరో పార్టీలోకి మారడం రాజ్యాంగ విరుద్ధమని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిటిషన్ లో కోరారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ ఆరు నెలల తిరగకముందే మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారని అందులో మెన్షన్ చేశారు. రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరి అధికారాలను అనుభవించడం తప్పని ప్రస్తావించారు. ఇది చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ నేతలు కౌశిక్‌రెడ్డి, వివేకానందగౌడ్‌ పిటిషన్‌ పై సెప్టెంబర్ 9న తీర్పునిచ్చిన హైకోర్టు వారి అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయానికి  ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది. ఆ పిటిషన్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్‌ఎస్ కోరింది. తాజాగా కేఏ పాల్ 10మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్ విచారణలోనూ హైకోర్టు నోటీసులు జారీ చేయడం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరింత ఇరకాటంగా తయారైంది. 


Similar News