మల్లన్నసాగర్ బాధితులతో.. చర్చకు హరీష్ రావు సిద్ధమా?

మూసి ఆక్రమణలు తొలగిస్తుంటే నిరాశ్రయులైన వారిని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఒగల ఏడ్పులు ఏడుస్తున్న హరీశ్ రావు ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి.

Update: 2024-10-03 23:30 GMT

మూసి ఆక్రమణలు తొలగిస్తుంటే నిరాశ్రయులైన వారిని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఒగల ఏడ్పులు ఏడుస్తున్న హరీశ్ రావు ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం అనేక గ్రామాల్లో బలవంతంగా భూసేకరణ చేశారు. ఒక్కో కుటుంబం పదెకరాల వరకూ భూములను, ఇళ్లను కోల్పోయింది. బాధితులకు పరిహారం ఇప్పిస్తానని,, ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చిన హరీష్ రావు ఎంతమందికి న్యాయం చేశారో.. ఎంతమంది ఉసురు పోసుకున్నారో ఆయా గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. మూసీ బాధితుల గురించి మాట్లాడే ముందు...పోరాటాలు చేసే ముందు ఒకసారి మల్లన్నసాగర్ బాధితులతో చర్చించేందుకు హరీశ్ రావు సిద్దమేనా?... అనే ప్రశ్నలు వస్తున్నాయి. హరీష్ రావు ముందు ఈ పనిచేసి మల్లన్నసాగర్ బాధితులకు అన్యాయం చేయలేదని వారితో ఒప్పించి ఆ తర్వాత మూసి బాధితుల పక్షాన ఆందోళన చేస్తే బాగుంటుంది.

ఎవరైనా ఇళ్లు కట్టుకోవచ్చా?

''వరద నీటి కాలువలు.. బఫర్ జోన్ల పరిధిలో 28 వేల అక్రమ నిర్మాణాలున్నాయి. హైదరాబాద్‌లో వరద ముంపు సమస్య రాకుండా ఉండాలంటే అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందే. కొత్తగా ఎవరైనా నాలాలు..బఫర్ జోన్ల పై.. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మాణాలను చేపట్టాలనుకునే వారు గుర్తుంచుకోవాలి...ప్రభుత్వం కచ్చితంగా వాటిని కూల్చివేస్తుంది. మీడియా కూడా సపోర్ట్ చేయాలి.'' కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మాట్లాడిన మాటలివి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరైనా ఇళ్లు కట్టుకోవచ్చు... ఎవడినీ అడగాల్సిన అవసరం లేదు... మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మాట్లాడిన మాటలివి... ఈ రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారంలో కొనసాగిన కాలంలో తానూ..తన తండ్రి అక్రమ నిర్మాణలపై మాట్లాడిన మాటలను కేటీఆర్ ఎందుకు మననం చేసుకోవడం లేదు?. ఆయనకు గుర్తులేకనా?... గుర్తున్నా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న దుగ్ధతోనా?. కేటీఆర్ వాలకం చూస్తుంటే రెండోదే కరెక్ట్ అనిపిస్తుంది.

ఈ కృత్రిమ ఆందోళనలు ఎందుకు?

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కాలంలో చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయిస్తోంది. దీనికోసం హైడ్రా పేరిట ఓ విభాగాన్ని ఏర్పాటు చేశారు. చెరువులు..బఫర్ జోన్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో వరదల సమస్య తలెత్తకుండా చెరువుల ఆక్రమణలను తొలగించాల్సిందే అని జనం కోరుతున్నారు. ఇదే తరహాలో మూసీ నదిలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సుమారు 16 వేల అక్రమ నిర్మాణాల్లో పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించి ఖాళీ అయిన నివాసాలను కూల్చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రజలను ఒప్పించి తొలగించాల్సిన నివాసాలకు మార్కింగ్ చేస్తున్నారు అధికారులు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తీసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఈ పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి కేటీఆర్, హరీశ్ రావు రంగంలోకి బాధితుల పక్షాన తాము పోరాడుతామని కృత్రిమ ఆందోళన మొదలు పెట్టారు.

నాడు కన్నీళ్లెందుకు రాలేదు హరీశ్?

మూసి ఆక్రమణలు తొలగిస్తుంటే నిరాశ్రయులైన వారిని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఒగల ఏడ్పులు ఏడుస్తున్న హరీశ్ ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం అనేక గ్రామాల్లో బలవంతంగా భూసేకరణ చేశారు. ఒక్కో కుటుంబం పదెకరాల వరకు భూములు, ఇళ్లను కోల్పోయింది. బాధితులకు పరిహారం ఇప్పిస్తానని,, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చిన హరీష్ రావు ఎంతమందికి న్యాయం చేశారో.. ఎంతమంది ఉసురు పోసుకున్నారో ఆయా గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. అంటే మూసీ అభివృద్ధి పేరిట పేదల నివాసాలు కూల్చేయాలా?.. మూసీ సుందరీకరణకు ఏం తొందరొచ్చింది? అనే ప్రశ్నలు వేసే ముందు ప్రభుత్వం సుమారు 16 వేల కుటుంబాలు మూసీ నది గర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకుందని, అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తూ.. ఖాళీ అయిన ఇళ్లను మాత్రమే కూల్చేస్తోంది. మీలాగ తప్పుడు హామీలు ఇచ్చి..బలవంతంగా భూసేకరణ జరిపితే ప్రశ్నించండి. అంతేగానీ కొన ఊపిరితో ఉన్న బీఆర్ఎస్ ను తిరిగి బ్రతికించుకోవాలనే దింపుడు కళ్లెం ఆశలతో అమాయక ప్రజలను రెచ్చగొడితే చివరకు ఆ ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టక మానరు. మూసీ బాధితుల గురించి మాట్లాడే ముందు...పోరాటాలు చేసే ముందు ఒకసారి మల్లన్నసాగర్ బాధితులతో చర్చించేందుకు హరీశ్ రావు సిద్దమేనా?... అనే ప్రశ్నలు వస్తున్నాయి. హరీశ్ రావు ముందు ఈ పనిచేసి మల్లన్నసాగర్ బాధితులకు అన్యాయం చేయలేదని వారితో ఒప్పించి ఆ తరువాత మూసి బాధితుల పక్షాన ఆందోళన చేస్తే బాగుంటుంది.

కూల్చాల్సిందే అన్న కేసీఆర్‌ను ఏంచేయాలి?

మూసీతోపాటు ఇతర నాలాల్లో 28వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని వాటిని కూల్చి వేయాల్సిందే అని, కేసీఆర్ సీఎం హోదాలో గతంలో ప్రకటించడం జరిగింది. అప్పుడు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి. మరి కేసీఆర్ మాటలను కేటీఆర్, హరీష్ రావు అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు... ఎందుకు ఉద్యమించలేదు?. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నిద్ర పోయిందా?... చెరువుల...కుంటలు..నాలాల్లో నిర్మాణాలకు అధికారులు అనుమతులు ఎట్లా ఇచ్చారు?... అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న కేటీఆర్ గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా ఉండి హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే ఎవరి పర్మిషన్ అవసరం లేదని ప్రకటించింది మీరు కాదా?... మీ అభయం తోనే కదా చాలా మంది జీహెచ్ఎంసీ అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. చెరువులు..కుంటలు..మూసీలో కూడా అక్రమ నిర్మాణాలు పెరిగింది అప్పుడే కదా?. చేయాల్సిన తప్పంతా చేసి ఇప్పుడు ఆక్రమణలను తొలగించాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టడాన్ని ఏమనాలి?.

హైదరాబాద్‌ను వరదల్లో ముంచెత్తాలా?

హైదరాబా‌ద్‌లో వరదల కారణంగా వందేల్లుగా అనేక ప్రాంతాలు ముంపుకు గురికావడం.. ప్రాణ..ఆస్థి నష్టం వాటిళ్లడం జరుగుతూనే ఉంది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని కల్పించడంలో భాగంగా ఓ పక్క చెరువుల ఆక్రమణలు తొలగిస్తూ.. మరోపక్క మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆధునిక వ్యాపార, విహార కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల ఎఫ్ టిఎల్, బఫర్ జోన్ పరిధిలో కేటీఆర్ సతీమణితో పాటు బీఆర్ఎస్ బడా లీడర్లు ఫామ్ హౌజులను అక్రమంగా కట్టుకున్నట్లు సమాచారం. ఈ ఫామ్ హౌజులను ప్రభుత్వం కూల్చివేయకుండా అడ్డుకోవడానికే హరీష్‌రావు, కేటీఆర్‌లు సీఎం రేవంత్ రెడ్డిపై కువిమర్శలకు దిగుతున్నారు. ఇదే సమయంలో మూసీ నది లో వెలిసిన అక్రమ కట్టాల తొలగింపు చర్య బావా బావమరదులిద్దరికీ ఊతంగా మారింది. కానీ ప్రభుత్వం మీలాగ ప్రజలకు అన్యాయం చేయడానికి ప్రయత్నించడం లేదు. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించిన తర్వాతే కూల్చివేతలను కొనసాగిస్తోంది. అయినా అదేదో సామెత మాదిరిగా ఈ ఇద్దరిని ప్రభుత్వం పట్టించుకుంటే కదా?.


 



-జంగిటి వెంకటేష్,

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఉపాధ్యక్షుడు.

90528 89696


Similar News