బుక్ చేసి 10 రోజులైనా..రావట్లే

జలమండలి వినియోగదారులకు సకాలంలో ట్యాంకర్లను అందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2023-04-26 02:21 GMT

దిశ, సిటీబ్యూరో: జలమండలి వినియోగదారులకు సకాలంలో ట్యాంకర్లను అందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు తగిన విధంగా నీటి సరఫరా జరగకపోవడంతో ఇంట్లో ఏ చిన్న కార్యమున్నా, చాలా మంది ట్యాంకర్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు. అయినా వారి అవసరాలకు తగిన విధంగా ట్యాంకర్లు రావడం లేదన్న వాదనలున్నాయి. మహానగరంలో ముఖ్యంగా ఎండలు మండి పోతుండటం, సరిపోయేలా సరఫరా జరగకపోవడంతో ఒక్కసారిగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. మౌలాలి, షేక్‌పేట్, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఎర్రగడ్డ, సైనిక్‌పురి, బుద్వేల్, మణికొండ, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో ట్యాంకర్లు బుక్ చేసి పది రోజులు గడిచినా, డెలివరీ కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.

దీంతో బుక్ చేసిన వారంతా హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్లు చేస్తున్నా, వారికి సంతృప్తికరమైన సమాధానం రావటం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నెల 16న బుక్ చేసిన వాటర్ ట్యాంకర్ ఇంకా వినియోగదారుడికి డెలివరీ కాలేదంటే ట్యాంకర్ల నిర్వహణ ఎంత అస్తవ్యస్తం‌గా జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు. ప్రతిరోజు హెల్ప్ లైన్‌కు వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నట్లు సమాచారం. ట్యాంకర్ బుక్ చేసిన తర్వాత సకాలంలో డెలవరీ చేయకపోవటం, రాలేదని ఫోన్ చేస్తే సమాధానమివ్వకపోవటంతో వినియోగదారులు ఎక్కువ డబ్బు వెచ్చించి మరీ ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.

సరఫరా టైమ్ తగ్గించారా?

మహానగరంలోని వివిధ ప్రాంతాలను బట్టి కనిష్టంగా గంటసేపు, గరిష్టంగా గంటన్నర సేపు వాటర్ సప్లై జరగాల్సి ఉంది. కానీ లైన్‌మెన్ల అవినీతి, మామూళ్ల డిమాండ్‌ను బట్టి కనిష్టంగా 40 నిమిషాలు, గరిష్టంగా 60 నిమిషాల పాటు సరఫరా జరుగుతున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గచ్చిబౌలీలోని కొన్ని అపార్ట్‌మెంట్‌కు సరిపడే సమయం వరకు నీటి సరఫరా ఇచ్చేందుకు లంచాలు డిమాండ్ చేసి ఓ లైన్‌మెన్ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా లైన్‌మెన్ల పనితీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం జలమండలి ఉన్నతాధికారుల పనితీరుకు నిదర్శనం.

నగరానికి నీటిని సరఫరా చేయాల్సిన జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లలో నీరు పుష్కలంగా ఉన్నా, ఆ నీటిని సరఫరా చేయకుండా గోదావరి, కృష్ణా జలాలను అధికారులు సరఫరా చేయటంపై నగరవాసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా నీటిలో ఒక లీటరు నీటిని నగరానికి తీసుకువచ్చేందుకు దాదాపు రూ.20 ఖర్చవుతూ జలమండలిపై అదనపు ఆర్థిక భారంగా మారుతుంది. అయినా అధికారులు నగరంలోని జలాశయాల నుంచి కాకుండా కృష్ణా, గోదావరి నీటిని సరఫరా చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని నగర ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

అమలుకాని ఆదేశాలు

వేసవికాలంలో నగరంలో ఎక్కడా కూడా నీటి సమస్య ఉత్పన్నం కాకుండా సిబ్బంది పని చేయాలని ఇదివరకే జలమండలి ఎండీ దాన కిషోర్ జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా అమలు కావడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సరిపోయే విధంగా నీటి సరఫరా, బోర్డుకు రెవెన్యూను పెంచడం, కొత్త కనెక్షన్ల దరఖాస్తులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా మంజూరీనిచ్చి, కనెక్షన్ ఇవ్వడం వంటి విషయాలకు సంబంధించి ఎండీ ఆదేశాలు బేఖాతరు కావడంతో పాటు డివిజన్లలోని సిబ్బంది, మేనేజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు కూడా వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News