రెండు గంటల పాటు నాన్‌స్టాప్ వర్షం.. డేంజర్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలు

సోమవారం సాయంత్రం నగర వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టగా ఫిలింనగర్, ఓల్డ్ సిటీ, అమీర్ పేట, కృష్ణ నగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి.

Update: 2024-08-20 02:03 GMT

దిశ, వెబ్ డెస్క్: సోమవారం సాయంత్రం నగర వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టగా ఫిలింనగర్, ఓల్డ్ సిటీ, అమీర్ పేట, కృష్ణ నగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా వరద ముంచెత్తిన.. రాత్రి వరకు వరదలు కాస్త తగ్గాయి. అయితే మంగళవారం తెల్లవారుజామున ఎవరూ ఊహించని విధంగా కుంభ వృష్టి వర్షం పడింది. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 2 గంటల పాటు నాన్ స్టాప్ గా వర్షం పడింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బోరబండ, షేక్ పేట, అమీర్ పేట, ఓల్డ్ సిటీ, రామ్‌నాగర్, హిమాయత్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్, మెహిదీపట్నం, టోలిచౌకి ప్రాంతాల్లో భారీగా వరద నీరు పేరుకు పోయింది.

పలు ప్రాంతాల్లో నడుము లోతు నీరు వచ్చి చేరడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు అన్ని నీటిలో మునిగిపోయాయి. అలాగే బల్కంపేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు వచ్చి చేరింది. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా వర్షం కురుస్తుండడంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ఎదైన సమస్య తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111,9000113667 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.

Tags:    

Similar News