ప్రశాంతంగా ముగిసిన పండుగలు

బోనాలు, గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంతంగా ముగిసేందుకు అధికారులు తీసుకున్న చర్యలను హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.

Update: 2024-09-25 13:36 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో : బోనాలు, గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలు ప్రశాంతంగా ముగిసేందుకు అధికారులు తీసుకున్న చర్యలను హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయడంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని అన్నారు. హోటల్ గోల్కొండలో ఏర్పాటు చేసిన బోనాలు, గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ సక్సెస్ మీట్ 2024 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించిన పండుగలలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండా పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు కృషి చేశారన్నారు. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇలాగే అందరూ సమిష్టి బాధ్యతగా భావించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను మరింతగా కాపాడాలని సూచించారు.

    రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించిందని, ప్రభుత్వ పాఠశాలలకు ఎలక్ట్రిసిటీ, వాటర్ ఉచితంగా అందిస్తుందని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతంను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నష్టం జరగకుండా పునరావాసం, ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా బోనాలు, గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలలో కష్టపడి పని చేసిన అధికారులకు మంత్రి శాలువా కప్పి మెమొంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, అడిషనల్ కలెక్టర్ వెంకటాచారి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News