Harish Rao: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే పింఛన్ ఆపడం అన్యాయం: హరీశ్ రావు సీరియస్
కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే, తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషమని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కొడుకు ఇంటి పన్ను కట్టకపోతే, తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ ఆపడం అన్యాయం, అమానుషమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా అధికారుల తీరును తప్పుబట్టారు. (Congress Govt Telangana) ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల తీరు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉన్నాయని సీరియస్ అయ్యారు. (Pensions) పింఛన్ డబ్బులను కూడా ఇంటి పన్ను కింద జమ చేసుకుంటే, ఆ వృద్ధుల బతుకు బండి నడిచేది ఎట్ల? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ప్రతి నెలా రూ.4 వేలు పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు వచ్చే రూ. 2వేల పింఛన్ను గుంజుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.
ఒకవైపు లబ్ధిదారుల్లో కోత విధిస్తూ, మరో వైపు చేతికందిన పింఛన్ను ఇంటి పన్ను బకాయిలో జమ చేయడం శోచనీయమన్నారు. మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలం, నంనూరు గ్రామ పంచాయతీ పరిధిలో 15 మంది వృద్ధులకు వెంటనే పింఛన్లు చెల్లించాలని, ఇంటి పన్ను, ఇతర కారణాలు చెప్పి పింఛన్లు ఆపకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.