మంచిర్యాల పట్టణానికి పోటెత్తిన గోదావరి వరద
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఎగువ నుండి వస్తున్న భారీ వరదకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
దిశ, వెబ్ డెస్క్ : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఎగువ నుండి వస్తున్న భారీ వరదకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తడమే కాకుండా, ఎగువన వాగులు వంకలు పొంగి గోదావరిలో కలుస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు ప్రాజెక్టు 30 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీని వలన గోదావరి నది ఒడ్డునే ఉన్న మంచిర్యాల పట్టణానికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో మెటర్నిటీ ఆసుపత్రిలోని బాలింతలను, చంటి పిల్లలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేపటి వరకు ఈ వరద ఇలాగే కొనసాగితే ప్రభుత్వ డిగ్రీ కాలేజి వరకు కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు అధికారులు. కాగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను, నదీ ఒడ్డున గల గంగా నగర్ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.