రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ ముందుకు ఇంజనీర్లు...ఉన్నతాధికారులు

రేపటి నుంచి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగనుంది.

Update: 2024-10-22 09:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : రేపటి నుంచి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగనుంది. రెండు విడతలలో కొనసాగనున్న బహిరంగ విచారణలో పలువురు ఇంజనీర్లను, రిటైర్డు ఇంజనీర్లను, ఉన్నతాధికారులను విచారణకు పిలువాలని అధికారులను కాళేశ్వరం కమిషన్ ఆదేశించింది. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లు, బ్యూరోక్రాట్ల విచారణ పూర్తి చేయాలనే ఆలోచనలో కాళేశ్వరం కమిషన్ ఉందని సమాచారం. ఇప్పటికే విచారణ చేసిన ఇంజనీర్లలోనూ పలువురుని మళ్ళీ కమిషన్ ప్రశ్నించనుంది. ఈ నెల 29వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. కమిషన్ కు అఫిడవిట్ దాఖలు చేసిన బీఆర్ఎస్ నేత వి.ప్రకాష్ ను ఈ వారంలోనే బహిరంగ విచారణకు పిలువనుంది. ఈ నెలాఖరులోగా ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ లు తమ ఫైనల్ రిపోర్టులను కమిషన్ కు అందించనున్నాయి. ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ అధికారులను కూడా కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. ఈసారి వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, అకౌంట్స్ ప్రతినిధులను సైతం కమిషన్ ముందుకు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. చివరగా ప్రజా ప్రతినిధులను బహిరంగ విచారణకు పిలవాలని కాళేశ్వం కమిషన్ నిర్ణయం తీసుకుంది.

రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగనున్న నేపథ్యంలో చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ మంగళవారం ఇరిగేషన్ అధికారులతో, విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విజిలెన్స్ రిపోర్ట్ పై జస్టిస్ చంద్రఘోష్ కు డీజీ వివరణ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలంటూ విజిలెన్స్ డీజీకి కాళేశ్వరం కమిషన్ స్పష్టం చేసింది. విచారణకు కాళేశ్వరం కమిషన్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇస్తామని విజిలెన్స్ డీజీ కొత్త కొట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


Similar News