అబద్ధానికి పర్యాయపదంగా సీఎం రేవంత్ పేరు.. : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

అబద్ధానికి పర్యాయపదంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మారిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-28 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: అబద్ధానికి పర్యాయపదంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు మారిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని.. అదే అబద్ధాలతో పాలన సాగిస్తోందన్నారు. కేంద్రం తమ మెడపైన కత్తి పెట్టి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నా కేసీఆర్ పెట్టలేదన్నారు. 2017 లోనే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకున్నట్లు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పి సభను, ప్రజలను తప్పు దోవ పట్టించారన్నారు.

రేవంత్ రెడ్డి చదివిన పేపర్ అబద్ధం అని కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చదివింది ఉదయ్ పథకానికి చెందినదన్నారు. ఉదయ్‌కు సంబంధించిన పేపర్‌లోని వాక్యాన్ని కొంత మింగి కొంతే చెప్పారన్నారు. మీడియా లో తప్పుడు వార్తలు రాసేలా పతాక శీర్షికల్లో వచ్చేలా సీఎం రేవంత్ కుట్ర పన్నారని తెలిపారు. సీఎం దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం మాకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా మేము మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదని గుర్తు చేశారు. త్వరలోనే విద్యుత్ వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారన్నారు.

విద్యుత్ సంస్థలను ప్రయివేటు వాళ్లకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని ఆరోపించారు. విద్యుత్ బిల్లుల వసూలును ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు సీఎం రంగం సిద్ధం చేశారన్నారు. ఏదో కొలంబస్‌లాగా వాస్కోడిగామా కనిపెట్టినట్లు సీఎం ఆ పేపర్ తీసుకొచ్చారన్నారు. మీడియాలో కావాలనే రోత రాతలు రాయించాడని.. తెలంగాణ ప్రజలు రేవంత్ కుట్రలను గమనించాలన్నారు. ఈ దుష్ప్రచారాని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

Tags:    

Similar News