అంతా ఎలక్షన్ గారడీ అంటూ.. దళిత బంధుపై ఐఏఎస్ మాజీ అధికారి విమర్శలు

ఎస్సీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు రావాలని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-01-23 08:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్సీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు రావాలని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన దళిత బంధు పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 1500 మంది చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.82 లక్షల మంది ప్రజలకు ఈ ఏడాది పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఈ ఏడాదిలో పథకం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒక్కరికి కూడా ఖర్చలు చేయలేదు. దీనిపై ఆకునూరి మురళి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

నిజంగా ఎస్సీలు అభివృద్ధి చెందాలనే నిబద్ధత నిజాయితీ ఉంటే 10 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం ఏంటి? అని ప్రశ్నించారు. ఇది మోసపూరిత స్కీం, అసంబద్ధమైన స్కీం, అంతా ఎలక్షన్ గారడీ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదంతా అబద్దాల పరిపాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. దీనిపై బాధ్యత వహిస్తూ ఎస్సీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు రావాలని డిమాండ్ చేశారు. అందరు ఎస్సీ(దళితులు)లు నిజం తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ యువత కళ్ళు తెరవాలని పిలుపునిచ్చారు. కాగా, దళిత బంధును తొలుత నియోకవర్గంలో 1500 మంది చొప్పున ఏడాదికి అమలు చేస్తామని ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆ తర్వాత 500కు కుదించింది. తాజాగా మళ్లీ ఆ సంఖ్యను 200కు తగ్గించినట్లు తెలుస్తోంది.

Also Read...

'నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను కమ్యూనిస్టు అనడం కాదు' 

Tags:    

Similar News