కొండా సురేఖపై మాజీ మంత్రులు సబితా.సత్యవతి..మాజీ ఎంపీ కవిత ఫైర్
సినిమా హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశాడంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన తీవ్ర ఆరోపణలు పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా ఆ పార్టీ మహిళా నేతలు తీవ్రంగా స్పందించారు
దిశ, వెబ్ డెస్క్ : సినిమా హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశాడంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన తీవ్ర ఆరోపణలు పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా ఆ పార్టీ మహిళా నేతలు తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా కొండా సురేఖ బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడడం బాధాకరమన్నారు. మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించినారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యగా రహితంగా మాట్లాడటం బాధాకరమని సబిత పేర్కొన్నారు. సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుందని, కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయమన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదని, వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలని,.. సమాజానికి ఆదర్శంగా ఉండాలి అని కొండా సురేఖకు సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత లు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మీడియాతో వారు మాట్లాడుతూ.. ‘‘ఖబడ్దార్ కొండా సురేఖ నిన్ను ఉరికించి కొడతాం.. నీ నాలుక చీరేస్తామని హెచ్చరించారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలను కించపరిచేలా కొండా సురేఖ మాట్లాడిందని, పదవి ఉందనే అహంకారంతో సురేఖ మాట్లాడుతోందని కవిత మండిపడ్డారు. కొండా సురేఖ వెంటనే కేటీఆర్కు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. కేటీఆర్ పై అభ్యంతరకర ఆరోపణలు చేసిన సురేఖపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన భాధితులకు న్యాయం చేయడం మానేసి..సమస్యను డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ పై లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తుందని మండిపడ్దారు.