Eatala Rajendar: పార్టీ కార్యకర్తగా నా వంతు సాయం చేస్తా

వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించాలని డిమాండ్ చేసిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్..

Update: 2024-09-03 15:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించాలని డిమాండ్ చేసిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్.. ఇండ్లను కోల్పోయినవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కేటాయించాలన్నారు. వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో పంటలకు నష్టం జరిగిందని, రైతులు ఆర్థికంగా నష్టపోయారని, వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. నష్టపోయిన పంటలకు పరిహారాన్ని చెల్లించాలన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయంలో దెబ్బతిన్నదని గుర్తుచేశారు. చాలా కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డాయని, వారిని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో అండగా ఉండాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన ప్రజలకు బీజేపీకి అండగా నిలుస్తుందని, పార్టీ కార్యకర్తగా తన వంతు సాయం అందిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఈ సహకారం ఉంటుందన్నారు.


Similar News