Deputy CM Bhatti: రైతులకు ఆదాయం వచ్చేలా చేస్తాం

రాష్ట్రంలోని రైతులు పంట ద్వారా మాత్రమే ఆదాయం పొందడమే కాకుండా.. పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయం

Update: 2024-10-16 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రైతులు పంట ద్వారా మాత్రమే ఆదాయం పొందడమే కాకుండా.. పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయం పొందేలా చేస్తున్నామని, దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు ద్వారా ముందుకు పోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ కల్యాణ్ నగర్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ సమయం పెరిగినా ఖర్చు తగ్గించి భవనాన్ని ప్రారంభించుకున్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన లేకుండా ప్రాజెక్టులు నిర్మించి ఉత్పత్తి వ్యయం పెంచి ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో రెగ్యులేటరీ కమిషన్ పెట్టుబడిని లెక్కించి ప్రజలపై భారం పడకుండా నియంత్రిస్తుందన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరులను వినియోగించుకొని 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మన ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నతంగా ఎదిగేందుకు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా భవిష్యత్తు తరాలకు తాము పెడుతున్న పెట్టుబడిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ దేశ జీడీపీని పెంచేందుకు కృషి చేస్తున్నట్టు భట్టి విక్రమార్క వివరించారు. రాబోయే పది సంవత్సరాలకు కావాల్సిన పీక్ డిమాండ్ ను అందుకునేందుకు విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. రెగ్యులేటరీ కమిషన్ కు సిబ్బంది కొరత ఉందని, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టు వివరించారు. వారికి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.

ఈ భవన ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రావాల్సి ఉన్నా.. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో హాజరు కాలేకపోయారని తెలిపారు. ఉత్పత్తి శక్తులను ప్రోత్సహించి ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ ఉత్పత్తి చేసి ధరలు పెంచకుండా రెగ్యులేటరీ కమిషన్ పనిచేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ రంగారావు, టెక్నికల్ మెంబర్ మనోహర రాజు, ఫైనాన్స్ మెంబర్ కృష్ణయ్య, సీఎండీలు ముషారఫ్ అలీ ఫారుఖీ, వరుణ్ రెడ్డి, జేఎండీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


Similar News