‘ఆదాయ మార్గాలు అన్వేషించండి’.. అధికారులకు డిప్యూటీ CM భట్టి, మంత్రి సీతక్క కీలక సూచన

మైనింగ్ శాఖలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం ఆయన సెక్రటేరియట్‌లో

Update: 2024-06-11 16:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మైనింగ్ శాఖలో ఆదాయ మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంగళవారం ఆయన సెక్రటేరియట్‌లో గనుల శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్ రూపొందించి వెను వెంటనే టెండర్లు పిలవాలన్నారు. గతంతో పోలిస్తే గణనీయంగా ఆదాయాలు పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతుకు భూగర్భం నుంచి త్వరితగతిన ఇసుక తరలించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ఈ ప్రాజెక్టుల పరిధిలో మరమ్మతులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో నది తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్‌లు, టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేసుకోవాలని, సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్రంలో పలు గ్రానైట్ క్వారీలకు ఫైన్లు వేసి గతంలో మూసివేశారని, ఆ ఫైన్‌లు ఎంత వరకు వసూలు చేశారు..? ప్రస్తుతం ఆ క్వారీలా పరిస్థితి ఎలా ఉన్నది..? వంటి అంశాలపై వివరాలు తయారు చేయాలన్నారు.

పట్టా భూముల పేరిట గోదావరి నది తీరం వెంట ఇష్టారీతిగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారన్నారు. వీటిపై నిఘా పెట్టాలని మంత్రి సీతక్క అధికారులను కోరారు. ఇసుక రీచ్‌లను ఆయా ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు సంఘాలకు కేటాయించడం, వ్యాపారం నిర్వహించేందుకు వారికి శిక్షణ, బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తే దళారులకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంటుందా..? అనే అంశం ఆలోచించాలని సీతక్క కోరారు.

ఇసుక ర్యాంపు నుంచి వినియోగదారునికి చేరేవరకు మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చడం, ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా మాఫియా కార్యకలాపాలు గాని, రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగే పని గానీ జరగకుండా చూడాలని తెలిపారు. ఈ మీటింగ్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రెటరీ హరిత, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



Similar News