విమానాశ్రయాల్లోనూ తనిఖీలు చేయండి.. అధికారులకు CS ఆదేశం

ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోతుండడం, అక్రమ మార్గాల్లో నగదు రవాణా కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.

Update: 2024-04-01 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోతుండడం, అక్రమ మార్గాల్లో నగదు రవాణా కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటైనా రాష్ట్ర సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించేలా అదనంగా 85 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంపైనా, ఉల్లంఘనలకు తావు లేకుండా చూడడంపైనా వివిధ శాఖల అధికారులతో ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. ఏయే రూపాల్లో ఏమేం సప్లై అవుతున్నాయో ఎక్సయిజ్, రవాణా, కమర్షియల్ టాక్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలయ్యే సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో పాటు బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాల్లోనూ తనిఖీలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు సరిహద్దు జిల్లాల్లో ‘డ్రై డే’ (మద్యం దుకాణాల మూసివేత) విధానాన్ని పాటించాలని, ఆయా రాష్ట్రాల నుంచి సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. హవాలా ఏజెంట్లు, స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలను గుర్తించి సీజ్‌లకు సహాయపడే నిఘాను పెంచాలన్నారు. అటవీ శాఖ అధికారులను కూడా అలర్టు చేశారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలతో అంతర్రాష్ట్ర సమావేశాలు నిర్వహించామని, ఆ మీటింగుల్లో వచ్చిన అంశాల ఆధారంగానే 85 సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వియలెన్స్ బృందాలతో నిఘాను పెంచామని, దీని ఫలితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన ఈ రెండు వారాల్లోనే సుమారు రూ. 35 కోట్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు సీఎస్‌కు వివరించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇంటిగ్రెటెడ్ చెక్‌పోస్టుల ద్వారా నిఘాను పెంచడంతో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ. 5.19 కోట్లు స్వాధీనమైనట్లు ఆ శాఖ కమిషనర్ శ్రీదేవి వివరించారు. రాష్ట్రం నుండి బయటకు వచ్చే, వెళ్లే వస్తువులను కూడా ఈ శాఖ మ్యాపింగ్ చేసిందని, ఫలితంగా నేరస్థులను పట్టుకోవడం సులభమైందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల తయారీ, వ్యాపార గోడౌన్లపై కూడా నిఘా పెంచామన్నారు.

ఈ సమావేశంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, సీనియర్ పోలీస్ అధికారులు మహేష్ భగవత్, సంజయ్ జైన్, రవాణా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజు, రవాణా శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News