బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడినే హడలెత్తించిన నకిలీ సీబీఐ.. రూ.15 కోట్లివ్వాలంటూ..

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డిని నకిలీ సీబీఐ అధికారులు హడలెత్తించారు. సీబీఐ అధికారులమంటూ ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేశారు.

Update: 2024-10-08 05:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాకాటి నారాయణరెడ్డిని నకిలీ సీబీఐ అధికారులు హడలెత్తించారు. సీబీఐ అధికారులమంటూ ఏకంగా రూ.15 కోట్లు డిమాండ్ చేశారు. థాయ్‌ల్యాండ్‌కి పంపిన పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, దానిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.15 కోట్లు ఇవ్వాలని హెచ్చరించారు. అయితే ఇప్పటికే తనపై సీబీఐ కేసులు ఉండడంతో షాక్ అయిన వాకాటి.. తాను ఎలాంటి పార్సిల్ పంపించలేదని గట్టిగా చెప్పారు. కానీ కేటుగాళ్లు మాత్రం.. పార్సిల్ పంపకపోతే.. అదే విషయాన్ని ముంబైలోని సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలంటూ వాట్సాప్‌ కాల్‌లో బెదిరించారు. అనంతరం ఆయనకు సంబంధించిన కీలకమైన పర్సనల్ డేటా చెప్పాలని బలవంతం చేశారు.

తాను నిజంగానే అధికారులతో మాట్లాడుతున్నట్టు భావించిన నారాయణరెడ్డి.. తన కాల్స్ డేటా, ఆధార్ కార్డ్ నెంబర్‌లతో పాటు మరికొన్ని వివరాలను వాళ్లకి ఇచ్చారు. ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన కేసులు కోర్టులో నడుస్తున్నాయని వాకాటి చెప్పినా.. కేటుగాళ్లు మాత్రం వినిపించుకోకుండా.. వాటన్నింటికంటే డ్రగ్స్ కేసు పెద్దదని, ఇందులో ఇరుక్కోకుండా ఉండాలంటే రూ.15 కోట్లు చెల్లించాల్సిందేనని బెదిరింపులకు దిగారు. వీటన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే.. తాము ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని 4 రోజులపాటు నిఘా పేరుతో సెల్ఫ్ కస్టడీలో ఉండాలని హెచ్చరించారు. 


Similar News