గ్రామీణ ప్రాంతాల్లోనూ పెట్రేగిపోతున్న సైబర్ నేరాలు.. ఎక్స్‌లో ఎండీ సజ్జనార్ పోస్ట్

గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ నేరాలు పెట్రేగిపోతున్నాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

Update: 2024-09-23 08:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లోనూ సైబర్ నేరాలు పెట్రేగిపోతున్నాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. గ్రామీణుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెడుతున్నారని తెలిపారు.సైబర్ నేరాల నివారణకు స్వీయ అవగాహన కలిగి ఉండటం ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డారు. ఆ దిశగా కరపత్రాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన 'యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్' కృషి అభినందనీయం అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వారు ముద్రించిన కరపత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సైబర్ మోసాలు, నేరాలు-పాటించాల్సిన జాగ్రత్తలపై కరపత్రంలో వారు ముద్రించారు. ఫెడెక్స్ పార్సిల్ అంటూ మోసాలు, ఆడపిల్లలను కిడ్నాప్ చేశారంటూ కాల్స్, న్యూడ్ వీడియో కాల్స్‌తో బెదిరింపులు, ఈ-కేవైసీ పేరుతో కుచ్చుటోపి, క్రిప్టో కరెన్సీ, ట్రేడింగ్‌లో పెట్టుబడులంటూ సోషల్ మీడియాపై లింక్స్.. లాంటి పద్దతులతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టోల్ ఫ్రీ 1930 నెంబర్‌కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి నేరుగా ఫిర్యాదు ఇవ్వొచ్చని కరపత్రం పబ్లీష్ చేశారు.


Similar News