MP : ఓట్ల కోసం లౌకికవాదం పేరిట విమర్శలు

దేశంలో ఓట్ల కోసం లౌకికవాదం పేరిట సనాతన ధర్మాన్ని విమర్శించడం పరిపాటిగా మారిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Update: 2024-10-11 13:28 GMT

దిశ, వర్గల్: దేశంలో ఓట్ల కోసం లౌకికవాదం పేరిట సనాతన ధర్మాన్ని విమర్శించడం పరిపాటిగా మారిందని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత శిఖరాలకు చేర్చగా, గతానికి భిన్నంగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరువలో ఉన్నట్లు స్పష్టం చేశారు. హిందూ సమాజం లౌకికవాదుల చర్యలను అడ్డుకోవడానికి మరింత చైతన్య వంత కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా యువత యాంత్రిక జీవనానికి లోనై ధర్మం పట్ల ఆకర్షితులవుతుండడం శుభ పరిణామం కాగా, ధర్మాన్ని పరి రక్షిస్తే అది మనల్ని కాపాడుతుందని తెలిపారు.

దేవి నవరాత్రుల పర్వదిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఉపవాస దీక్షలో ఉండగా, ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పుణ్యకార్యాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. అలాగే కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రం అద్భుతంగా ఉందని, తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ఆలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక భావన, మానసిక ప్రశాంతతను పంచుతున్న క్షేత్ర సముదాయంలో చక్కటి ఏర్పాట్లు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేస్తుందని అన్నారు.

అలాగే వర్గల్ క్షేత్రాన్ని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని, దేవి ఉపాసకులు, క్షేత్ర వ్యవస్థాపక చైర్మన్, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో ప్రధాన క్షేత్రాలకు ధీటుగా వర్గల్ క్షేత్రం రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. కాగా మొదటగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులకు అర్చకులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు మోహన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News